రైతన్నల జాతర

15 Jan, 2017 21:33 IST|Sakshi
రైతన్నల జాతర
ఎమ్మిగనూరు : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించుకునే ఎమ్మిగనూరు జాతర వృషభాలు, వాటి అలంకరణ సామగ్రి, సాగు పరికరాల విక్రయాలకు పేరు గాంచడంతో రైతుల జాతరగా మారిపోయింది. వృషభాలు, సాగు పరికరాల క్రయవిక్రయాలకు తరలివచ్చిన వారితో జాతర కళకళలాడుతుంది. నాలుగు రోజులపాటు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు బలప్రదర్శనలు జరుగుతాయి. ఆదివారం మంత్రాలయం రహదారిలో ఏర్పాటు చేసిన ఎద్దుల సంతకు ఒంగోలు జాతి, కిలారీ జాతి, దూపాటి, సీమరకం ఎద్దులు, తూరునాటి దూడలు అధిక సంఖ్యలో అమ్మకానికి తరలివచ్చాయి. జత వృషభాల ధర రూ.50వేల నుంచి రూ.1.80 లక్షల వరకు పలికాయి.  ముఖ్యంగా సేద్యంకు చురుకుదనంతో ఉండే కిలార్‌ రకం ఎద్దుల కొనుగోలుకు రైతులు మొగ్గు చూపారు. భవిష్యత్తుల్లో బలప్రదర్శనకు ఉపయోగపడే తూరునాటి దూడలు జత రూ.25 వేల వరకు పలికాయి స్థానిక టీటీడీ కల్యాణమంటపం ఆవరణలో  ఎద్దుల బండ్లు, వాటి చక్రాలను అమ్మకానికి ఉంచారు.బండి ధరను రూ.25వేలు, బండికి అమర్చే రెండు చక్రాలు రూ.15వేల వరకు ధర పలికాయి.
మరిన్ని వార్తలు