చైల్డ్‌లైన్ చెంతకు చేరిన ఐదేళ్ల బాలిక

16 Jul, 2016 18:20 IST|Sakshi

ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని దేవుడు చెరువులో శుక్రవారం ఒంటరిగా తిరుగుతున్న ఐదేళ్ళ బాలిక లక్ష్మి చైల్డ్‌లైన్ చెంతకు చేరింది. దేవుడు చెరువులో ఒంటరిగా తిరుగుతూ ఏడుస్తున్న లక్ష్మిని స్థానికులు గమనించి ఆ పాప తల్లి, దండ్రులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. ఎంతకీ చెప్పలేక పోవటంతో స్థానికులు ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 

వన్‌టౌన్ పోలీసులు చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్‌కు సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సాగర్ పాప వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే తనపేరు లక్ష్మి అని, తండ్రి బ్రహ్యయ్య, తల్లి మల్లేశ్వరి అని మాత్రమే చెబుతోంది. అంతకు మించిన వివరాలు ఏమీ చెప్పలేక పోతోందని బివి.సాగర్ వివరించారు. వెంటనే పాపను జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఒంగోలులోని శిశుగృహలో చేర్పించారు. అప్పటి నుంచి పాప రోధిస్తూనే ఉంది. పాప ఆచూకి తెలిసిన వారు వెంటనే చైల్డ్‌లైన్-1098 నంబరుకు ఫోన్ చేసి వివరాలు అందించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు