అనంతలో హై అలర్ట్

2 Jul, 2016 21:59 IST|Sakshi
అనంతపురం: హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు రెండు నెలల క్రితం అనంతపురంలో ఐదు రోజుల పాటు మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో తేలడంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం మూడో పట్టణ పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జీలన్నీ జల్లెడ పట్టారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) ఉగ్రవాదులు హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, పేలుడు సామగ్రి కోసం రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.

కర్ణాటక నుంచి సామగ్రిని తెచ్చుకోవడానికి ఐదు రోజుల పాటు అనంతపురంలోని ఓ లాడ్జీలో మకాం వేశారు. ఐదు రోజుల తర్వాత వారిని వెనక్కు పంపాలని ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్ ఆదేశించడంతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లినట్లు ఎన్‌ఐఏకు పట్టుబడిన ఉగ్రవాదులు విచారణలో వెల్లడించారు. దీంతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఐదు రోజులు ఉగ్రవాదులు లాడ్జీలో తిష్టవేసినా సమాచారం లేకపోవడం నిఘా వర్గాల వైఫల్యంగా భావిస్తున్నారు.
 
 
 
మరిన్ని వార్తలు