మాయమై పోయాడమ్మా...

2 Oct, 2016 23:00 IST|Sakshi
మాయమై పోయాడమ్మా...

•    బాలింత,  కవల పిల్లలను వదిలి వెళ్లిన భర్త
•    పూట గడవని స్థితిలో బాధితురాలు
•    ప్రాణాపాయ స్థితిలో చిన్నారులు
•    పట్టించుకోని కుటుంబసభ్యులు

మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న ఓ కవి గేయానికి.. అద్దం పడుతోంది ధర్మవరంలోని ఓ బాలింత రాలి దీనస్థితి. కట్టుకున్న వాడు కఠినాత్ముడై.. పచ్చి బాలింతరాలైన ఇల్లాలిని, పుట్టిన కవలలను వదిలి వెళ్లిపోతే ఒక్కపూట తిండికోసం ఆ అభాగ్యురాలు నానా ఇబ్బందులు పడుతోంది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు... పిల్లల ప్రాణాపాయ స్థితి తీరని వ్యధనే మిగుల్చుతోంది. జీవిత కాలం తోడుంటానన్న భర్త... కుటుంబ పోషణకు భయపడి నిర్ధయగా తనదారి తాను చూసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన కుటుంబసభ్యులు కూడా ముందుకు రాకపోవడంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయింది.


కోటి ఆశలతో కొత్త జీవితంలోకి...
ధర్మవరంలోని పీఆర్‌టీ వీధికి చెందిన సరస్వతి, చంద్రశేఖర్‌ దంపతుల కుమార్తె నీలిమ. పదో తరగతి వరకు చదువుకున్న నీలిమాకు.. ధర్మవరం రైల్వేస్టేషన్‌లో క్యాటరింగ్‌ పనులు చేస్తున్న మునికష్ణతో దాదాపు 18 నెలల క్రితం పెళ్లి జరిగింది. అనంతరం ధర్మవరంలోని కొత్తపేటలో ఓ అద్దె ఇంటిలో నూతన దంపతులు కాపురం పెట్టారు. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నీలిమాకు... అడుగడుగునా కష్టాలు మొదలయ్యాయి.  

వేధింపులు... శాపనార్థాలు
భర్తతో కలిసి నీలిమ జీవించింది కొద్ది కాలమే అయినా.. అనునిత్యమూ భర్త వేధింపులు ఆమెకు చేదు అనుభవాలే మిగిల్చాయి. కూతురి జీవితంలోకి తల్లిదండ్రులు కల్పించుకుంటే సహించలేని మునికష్ణ మరింత హింసించేవాడు. దీంతో విసుగు చెందిన తల్లిదండ్రులు నెమ్మదిగా నీలిమకు దూరమవుతూ వచ్చారు. తరచూ భార్యతో గొడవపడే మునికష్ణ పరిస్థితి తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి కేరళకు పారిపోయేవాడు. ఆ సమయంలో నీలిమను తల్లిదండ్రులు చేరదీస్తే వారిపై చిందులు తొక్కేవాడు. దీంతో వారు శాశ్వతంగా ఆమెకు దూరమయ్యారు.

అబార్షన్‌ చేయించుకోలేదని...
ఏడాది క్రితం నీలిమా గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న మునికష్ణ అబార్షన్‌ చేయించుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఆమె పట్ల నిర్ధయగా వ్యవహరించేవాడు. గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరించేవాడు. ఈ నేపథ్యంలోనే నెలలు నిండడంతో గత నెల 4న ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో పండంటి కవలలకు నీలిమ జన్మనిచ్చింది. ఇద్దరూ మగపిల్లలు కావడంతో వారిని చూసిన తర్వాతైనా తన భర్తలో మార్పు వస్తుందని ఆమె భావించింది. తనను, పిల్లలను బాగా చూసుకుంటాడని ఆశపడింది. అయితే వారం రోజులకే మునికష్ణ ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

పౌష్టికార లోపంతో రక్తహీనత
ఆస్పత్రి నుంచి ఇద్దరు శిశువులతో ఇంటికి చేరుకున్న నీలిమకు సపర్యలు చేసేందుకు కూడా ఎవరూ లేరు. అన్నీ తానే చేసుకునేది. కాలనీ వాసులు కొంత మేర సహకరించేవారు. ఇలాంటి సమయంలో తోడుగా ఉంటాడనుకున్న భర్త చెప్పాపెట్టకుండా ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అల్లుడి ప్రవర్తనకు భయపడి నీలిమ తల్లిదండ్రులు ఆమెను చేరదీసేందుకు ముందుకు రాలేదు. ఒకటి.. రెండు... రోజులు గడుస్తున్నా... భర్త వెనుదిరిగి ఇంటికి రాలేదు. పూట గడవడం కష్టమైంది. ఇంట్లో ఉన్న తింyì lగింజలు కాస్తా అయిపోయాయి. పౌష్టికాహారం లోపించడంతో క్రమేణ నీలిమ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తల్లితో పాటు పిల్లలూ రక్తహీనత బారిన పడ్డారు. శిశువుల పరిస్థితి మరింత క్షీణించింది. ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. విషయాన్ని గుర్తించిన కాలనీ వాసులు బాలింతరాలికి సాయం చేస్తూ వస్తున్నారు.  ఆ దారిన పోయేవారు సైతం ఆమె దీనావస్థకు చలించిపోతున్నారు. తమకు తోచిన ఆర్థిక సాయం అందిస్తున్నారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించలేని అసహాయ స్థితిలో నీలిమ కొట్టుమిట్టాడుతోంది.  

ఇల్లు ఖాళీ చేయమంటున్నారు
తెలివి తక్కువదానివని నా భర్త నన్ను వేధించేవాడు. గర్భం దాల్చిన తర్వాత పిల్లలు వద్దని గొడవ పడ్డాడు. అయినా నేను వినలేదు. కవలలు పుట్టిన తర్వాత చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. నా భర్త ప్రవర్తనకు భయపడి నా తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు. మూడు నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యజమానులు ఖాళీ చేయమంటున్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేదు. ఎవరైనా నా పిల్లలకు మెరుగైన వైద్య చేయించండి
– నీలిమ, బాధితురాలు

న్యాయం చేయాలి
నీలిమ పరిస్థితి చూసి కాలనీలో వాళ్లం మా వంతు సాయం అందిస్తున్నాం.  రోజూ ఆసుపత్రికి తీసుకెళ్లి ఖరీదైన వైద్యం చేయించాలంటే మాకూ ఇబ్బందిగా ఉంది. అ«ధికారులు స్పందించి పిల్లలను, ఆమెను స్త్రీశిశు సంరక్షణ వసతి గహానికి తరలించి మెరుగైన వైద్యం అందించి న్యాయం చేయాలి.
– అన్వర్, కొత్తపేట కాలనీ

>
మరిన్ని వార్తలు