ఉసురు తీసిన అనుమానం

17 Mar, 2016 04:36 IST|Sakshi

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో ఘటన..

 గోగినేనివారిపాలెం (పొదిలి) :  అనుమానపు భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని గోగినేనివారిపాలెం ఎస్సీ కాలనీలో బుధవారం వేకువ జామున  జరిగింది. హతురాలి బంధువుల క థనం ప్రకారం.. వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి తిరుపతమ్మ(30)కు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో సుమారు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్‌కాగా తిరుపతమ్మ ఇంటి వద్ద పనులకు వెళ్తుంటుంది.  భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. రెండేళ్ల నుంచి ఆమెను మానసికంగా.. శారీరకంగా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం బెంగళూరు తదితర ప్రాంతాల్లో బేల్దారి పనులకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవల భర్త నుంచి హింస ఎక్కువ కావటంతో పెద్దలు జోక్యం చేసుకుని దంపతులకు సర్ది చెప్పారు.

అయినా పరిస్థితి మారకపోవటంతో తిరుపతమ్మ కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో పుట్టింట్లో ఉన్న తిరుపతమ్మ బహిర్భూమి కోసం తెల్లవారు జామున ఒంటరిగా బయటకు వెళ్తుండగా వెంకటేశ్వర్లు ఆమెను అనుసరించి కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

 విడాకుల కోసం నోటీసులిచ్చి..
కాపురానికి రాకపోవడంతో విడాకులు ఇవ్వాలని వెంకటేశ్వర్లు ఇటీవల తన భార్య తిరుపతమ్మకు నోటీసులు కూడా పంపాడు.   నోటీసుల విషయమై ఆమె గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ  ఒకసారి సర్ది చెప్తామని, వ్యవహారం నోటీసుల వరకు ఎందుకని అన్నారని, ఇంతలోనే దారణం జరిగిందని బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

 కోడిపిల్ల కోసేందుకని కత్తి..
కోడిపిల్లను కోసుకునేందుకు కత్తి కావాలని పొరుగింటి వారిని వెంకటేశ్వర్లు అడిగాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో కోడిపిల్లను కోసుకోవటమేమిటని వారు ప్రశ్నించగా ఇప్పుడు దొరికితే ఇప్పుడు కోస్తాను.. లేదంటే తెల్లారి దొరికినా కోస్తానని నమ్మబలికాడు. వారు నిజమేననుకుని కత్తి ఇచ్చారు. ఆ కత్తితోనే భార్యను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శశికుమార్‌లు పరిశీలించారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

>
మరిన్ని వార్తలు