ఐసీడీఎస్‌ చెంతకు చిన్నారులు

16 Sep, 2016 22:35 IST|Sakshi

కడప రూరల్‌ :

ముద్దనూరుకు చెందిన లక్ష్మిదేవి ఈ ఏడాది ఉగాది రోజున కొన్ని కారణాల వల్ల కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ప్రైవేటు జీపు డ్రైవర్‌గా పని చేస్తున్న ఆమె భర్త శంకర్‌ మానసిక వేదనతో ఇటీవల మృతి చెందాడు. ఫలితంగా ఆ దంపతుల పెద్ద కుమార్తె వైశాలి (7), చిన్న కుమార్తె గౌరీప్రియ (3) అనాథలుగా మారారు. వీరిపై ‘సాక్షి’లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఇందుకు ఐసీడీఎస్‌ అధికారులు స్పందించారు. ముద్దనూరుకు చెందిన సూపర్‌వైజర్‌ లక్ష్మిప్రియ, కార్యకర్త విజయదుర్గ ఆ చిన్నారులను శుక్రవారం కడప ఐసీడీఎస్‌ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాఘవరావుకు అప్పగించారు.
బంధువుల రంగప్రవేశం
అయితే ఆ చిన్నారుల బంధువులు తాము పోషిస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ మేరకు ప్రాజెక్టు డైరెక్టర్‌ వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. తమ బాలసదన్‌లో ఈ చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అయినా వారు వినలేదు. ఈ చిన్నారులను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగిస్తామని, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని పీడీ తెలిపారు.

 
 

మరిన్ని వార్తలు