కృష్ణ.. కృష్ణా!

5 Jan, 2017 00:24 IST|Sakshi
కృష్ణ.. కృష్ణా!
సీమకు కన్నీళ్లే..
- ప్రస్తుతం శ్రీశైలంలో 113 టీఎంసీల నీరు
- తెలంగాణకు 43 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు
- సాగర్‌ నుంచి కాకుండా శ్రీశైలం నీరు దిగువకు..
- రోజుకు 42వేల క్యూసెక్కులు విడుదల
- నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటే పోతిరెడ్డిపాడుకు కష్టాలే..
- వెలుగోడుకు నీటి సరఫరా బంద్‌
- రబీ పంటల సాగుపై ప్రభావం
కర్నూలు సిటీ: శ్రీశైలం జలాలతో రాజకీయం చేస్తోంది. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూనే.. సాగు ఆశలపై నీళ్లు చల్లుతోంది. రోజుకో మాట మారుస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 113 టీఎంసీల నీరు ఉండగా.. నీటి మట్టం 862.5 అడుగులుగా నమోదయింది. నాగార్జున సాగర్‌లో 145 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా యాజమాన్య బోర్డు ఇటీవల తెలంగాణకు 43 టీఎంసీలు, ఏపీకి 87 టీఎంసీలు కేటాయించింది. ముందుగా నాగార్జున సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. అయితే ప్రభుత్వం గత వారం రోజులుగా శ్రీశైలం నుంచే నీటిని విడుదల చేయడం గమనార్హం. కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల నుంచి 42వేల క్యూసెక్కుల నీరుగువ సాగుర్‌కు విడుదలవుతోంది. ఈ కారణంగా జలాశయంలో రోజుకు 2 అడుగులు, 3.8 టీఎంసీల నీరు తగ్గుతోంది. మరో వారం రోజుల్లో నీటి మట్టం 854 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే రాయలసీమ కాల్వలకు నీరిచ్చే పోతిరెడ్డిపాడుకు నీరందని పరిస్థితి ఉంటుంది. 
 
పోతిరెడ్డిపాడుపై ప్రభావం
రెండేళ్లుగా ప్రభుత్వంతో పాటు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల హామీలతో రైతులు రబీ పంటలు సాగు చేస్తున్నారు.
వెలుగోడు పూర్తి స్థాయి సామర్థ్యం 16 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.2 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిలో కడపకు 4 టీఎంసీలు, తెలుగుగంగ కింద స్టాండింగ్‌ క్రాప్స్‌కు 1.5 టీఎంసీలు.. 3 టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. ఈ పరిస్థితుల్లో వెలుగోడుకు రెండు రోజుల క్రితం నీటి సరఫరా నిలిపేశారు. ఫలితం రిజర్వాయర్‌ పరిధిలోని పంటల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతోంది. ఇక అవుకు రిజర్వాయర్‌ పూర్తి స్థాయి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా 1.6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నీరు బంద్‌ చేయకుండా.. దిగువకు నీరు ఇవ్వకుంటే పోతిరెడ్డిపాడు ద్వారా బానకచర్ల కాంప్లెక్స్‌ నుంచి వెలుగోడులో మరో 8 టీఎంసీలు, అవుకులో 1.4 టీఎంసీలు.. గోరుకల్లు ద్వారా కడపకు గండికోటకు కనీసం 3 టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో శ్రీశైలంలో నీటి మట్టం తగ్గి పోతిరెడ్డిపాడుకు నీరు అందడం కూడా కష్టమయ్యే పరిస్థితి తలెత్తనుంది.
 
అవసరం లేకున్నా..
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోని నీటిని కృష్ణాబోర్డు ఇటీవల పంపిణీ చేసింది. జనవరి నెలకు ఏపీకి 37.1, తెలంగాణకు 17 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ ప్రకారం సాగర్‌ నుంచి నీటిని తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 145 టీఎంసీలలో 35 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే 131 టీఎంసీల నీటిని తరలించారు. శ్రీశైలం నుంచి నీరు తీసుకోవాల్సిన అవసరం లేకున్నా సాగర్‌కు విడుదల చేయడం చూస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న మాటపై టీడీపీ నేతలకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. దీనివల్ల జిల్లాలోని తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, వెలుగోడు కింద రబీలో సాగు చేస్తున్న పంటలకు నీటి కష్టాల ప్రమాదం పొంచి ఉంది. ఇంత జరుగుతున్నా నంద్యాల పార్లమెంట్‌లోని టీడీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించకపోవడం చూస్తే ఈ ప్రాంత ఆయకట్టుదారులపై వారికున్న ప్రేమను తెలియజేస్తోంది.
 
రబీ పంటలకు నీరు కరువు
శ్రీశైలం జలాశయం నీటిపై తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ కింద కర్నూలు జిల్లాలో 1.08 లక్షలు, కడపలో 1.67 లక్షలు, నెల్లురులో 2.54 లక్షలు, చిత్తూరు జిల్లాలో 0.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్‌ఆర్‌బీసీ కింద కర్నూలులో 1.60 లక్షలు, కడపలో 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ప్రస్తుతం తెలుగుగంగ కింద 3లక్షలు, ఎస్‌ఆర్‌బీసీ కింద 1.14 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ నేతల ప్రకటనలకు తెలుగుగంగ, అవుకు, కేసీ ఎస్కేప్‌ ఛానల్‌ కింద రబీ పంటలు సాగు చేçస్తున్నారు. వెలుగోడు కింద ఇప్పటికే వరి సాగు చేస్తున్నారు. సాగు మధ్యలో ఉన్నప్పుడే నీటి విడుదలను నిలిపేయడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా బోర్డు కేటాయింపుల ప్రకారం పోతిరెడ్డిపాడు ద్వారా 2 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 5.5 టీఎంసీల నీరు రావాల్సి ఉంది.
మరిన్ని వార్తలు