ప్రేమ జంట ఆత్మహత్య

15 Aug, 2015 18:21 IST|Sakshi
ప్రేమ జంట ఆత్మహత్య

నవీపేట (నిజామాబాద్) : కలిసి బతకాలనుకున్నారు.. పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు ఓ ప్రేమ జంట. చావులోనూ ఒకరి చేయి మరొకరు విడవద్దనుకున్నారేమో.. చున్నీతో ఇద్దరూ చేతులు కట్టుకొని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా సమీపంలోని గోదావరి నది వద్ద చోటుచేసుకుంది. శనివారం నదిలో రెండు మృతదేహాలు తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.

మృతుని(27) ఒంటిపై బ్లాక్ కలర్ టీషర్ట్,  జీన్స్ ప్యాంట్ ఉంది. మృతురాలు(21) ఆరెంజ్ కలర్ చుడీదార్ వేసుకొని ఉంది. ఇద్దరి చేతులు చున్నీతో కట్టేసినట్లు ఉన్నాయి. ఈ సంఘటన జరిగి దాదాపు మూడు రోజులు కావస్తుండటంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు నచ్చకపోవడంతోనే ఈ ఆత్మహత్యలు జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు