కొత్త బిల్డప్‌

6 Jan, 2017 22:45 IST|Sakshi
కొత్త బిల్డప్‌

2016 ఉత్పత్తి లారీలకు 2017 తయారీ ముద్ర
విజయవాడ కేంద్రంగా సాగుతున్న దందా
మోసపోతున్న కొనుగోలుదారులు 4 డ్రైవర్ల బీమాకూ ముప్పు
పట్టించుకోని అధికార యంత్రాంగం


‘కొత్త సంవత్సరం... కొత్త వాహనం’ వాహన రంగంలో అదో క్రేజ్‌... కొత్త సంవత్సరం ప్రారంభంలో వాహనాలు కొనేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో వాహనం అమ్మాలని భావించినప్పుడు రీసేల్‌ ధర ఎక్కువ ఉంటుంది. దీన్నే కొందరు ఆటోమొబైల్‌ వ్యాపారస్తులు అవకాశంగా మార్చుకుని బురిడీ కొట్టిస్తున్నారు.  గత ఏడాదిలో ఉత్పత్తి చేసిన వాహనాలను కొత్త ఏడాదిలో ఉత్పత్తిగా చూపిస్తూ విక్రయిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా అటు ప్రభుత్వాన్నీ ఇటు కొనుగోలుదారులను మోసగిస్తూ  కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ దందా కథా కమామిషు ఇదిగో ఇలా ....
    – సాక్షి, అమరావతిబ్యూరో



ఫొటోలోని లారీలను చూశారా!... అవి ఉత్తరాఖండ్‌లోని కంపెనీ ప్లాంట్‌ నుంచి విజయవాడలోని డీలర్‌కు కొన్ని రోజుల క్రితమే చేరిన వాహనాలు.  వాటి చాసిస్‌ నంబరు చూడండి... హెచ్‌పీజీడబ్ల్యూ3595 అని ఉంది. ఆ కంపెనీ 2017లో తయారు చేసే లారీలకు  ‘హెచ్‌’ సిరీస్‌ నంబరు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. కానీ ఆ లారీలు ఇన్‌వాయిస్‌లో అవి 2016, డిసెంబర్‌ 12న తయారైనట్లుగా ఉంది. అంటే 2016లో ఉత్పత్తి చేసిన దాదాపు వెయ్యి లారీలను 2017లో చాసిస్‌ నంబరుతో తీసుకువచ్చారు. 2016 డిసెంబరులోనే విజయవాడ చేరుకున్నాయి. 2017 జనవరిలో లారీలు కొనుగోలు చేయాలని ఉత్సుకత చూపించే వారికి వాటిని విక్రయించనున్నారు.

దందాపై అధికారుల ఉదాసీనం...
గత ఏడాది తయారైన లారీలు, ఇతర వాహనాలను కొత్త ఏడాది ముద్రతో విక్రయించే దందా విజయవాడ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా సాగిపోతోంది. నిబంధనల ప్రకారం ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ), ఎక్సైజ్‌ శాఖ, రవాణా శాఖ అధికారులు అన్ని పత్రాలు, చాసిస్‌ నంబర్లు, ఇతర అంశాలను పరిశీలించి ఆ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అనుమతించాలి.  అవేవీ పట్టించుకోకుండానే అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. పన్ను కడుతున్నారా లేదా.. తమకు అమ్యామ్యా ఇస్తున్నారా లేదా అన్నదే చూస్తున్నారు తప్ప... వాహనాల ‘తయారీ ఏడాది’ ముసుగులో సాగుతున్న అక్రమాలను పట్టించుకోవడం లేదు.

ఈసారి వెయ్యి లారీలు ...
ఈ ఏడాది కూడా విజయవాడకు దాదాపు వెయ్యి లారీలను డిసెంబరులోనే తీసుకువచ్చారు. 2016లో తయారైన లారీలను 2017 చాసిస్‌ నంబరుతో విజయవాడ స్టాక్‌ యార్డుకు చేర్చారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని షోరూంలకు తరలిస్తున్నారు. అనుకున్న విధంగా వాటిని దర్జాగా విక్రయించేసి సొమ్ము చేసుకోనున్నారు. అందుకోసం ముందుగానే అడ్వాన్సు బుకింగ్‌లు కూడా చేసేసుకున్నారు. అంటే రాష్ట్రంలో దాదాపు వెయ్యిమందికి 2017 ముద్రతో ఆ లారీలను విక్రయించనున్నారు. ఈ నెల 7 నుంచి లారీల విక్రయాలకు రంగంసిద్ధం చేశారు.

తీవ్ర నష్టం
► లారీల డీలర్ల మోసపూరిత విధానం వల్ల ప్రభుత్వం, వాహన కొనుగోలుదారులు నష్టపోతున్నారు. మరోవైపు ఆ లారీలను తీసుకువచ్చే డ్రైవర్లు బీమా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎలాగంటే...
► ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. 2017లో తయారయ్యాయని ట్రాన్స్‌పోర్టు వ్యాపారులు ఆ లారీలను కొనుగోలు చేస్తారు. వాస్తవానికి అవి 2016లోనే తయారయ్యాయి. భవిష్యత్తులో 15 ఏళ్ల వాహనాలను గుర్తించేందుకు అధికారులు సమగ్రంగా తనిఖీలు చేస్తే అసలు బండారం బయటపడుతుంది. చాసిస్‌ నంబరు ఆధారంగానే ఆ లారీ ఎన్నాళ్ల క్రితం ఉత్పత్తి చేశారో నిర్ణయిస్తారు. దాంతో కొనుగోలుదారులు ఒక ఏడాది ముందే లారీలను కోల్పోయి నష్టపోవాల్సి వస్తుంది.
► ఆ లారీలను తిరిగి విక్రయించేటప్పుడు లారీ యజమానులు నష్టపోవాల్సివస్తుంది. 2017లో ఉత్పత్తి చేసినట్లు భావించి విక్రయించేందుకు సిద్ధపడతారు. కానీ కొనుగోలుదారులు చాసిస్‌ నంబరు ఆధారంగా అవి 2016లోనే ఉత్పత్తి చేశారని నిర్ధారించుకుని తక్కువ విలువ కడతారు.
► ఉత్తరాఖండ్‌లోని కంపెనీ ప్లాంటు నుంచి సుదూరం ప్రయాణించి ... ఆ లారీలను డ్రైవర్లు విజయవాడ తీసుకువచ్చారు. మార్గమధ్యలో లారీలకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2016లో ప్రమాదం జరిగి ఉంటుంది. కానీ లారీ చాసిస్‌ నంబరు ప్రకారం అవి 2017లో ఉత్పత్తి చేసినట్లు చూపిస్తుంది.  2017లో ఉత్పత్తి అయిన లారీకి 2016లో ప్రమాదం ఎలా సంభవిస్తుంది అని బీమా సంస్థలు ప్రశ్నిస్తాయి. పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. డీలర్లు తమ లబ్ధి కోసం చేసే మోసం వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు