'రూపాయి' సిగరెట్ దండయాత్ర

6 Sep, 2015 03:03 IST|Sakshi
'రూపాయి' సిగరెట్ దండయాత్ర

 ♦ బంగ్లాదేశ్, మలేసియా నుంచి అక్రమ రవాణా
 ♦ ప్రైవేట్ బస్సులు, రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు సరఫరా
 ♦ బేగంబజార్‌లోని మూడు ఏజెన్సీల ద్వారా దిగుమతి
 ♦ ఇక్కడి నుంచే తెలంగాణ, ఏపీలకు పంపిణీ.. విక్రయం
 ♦ వాణిజ్యపన్నుల శాఖ దాడులతో వెలుగులోకి
 ♦ ఒక గోడౌన్ సీజ్.. రూ. 15 లక్షల పన్ను వసూలు
 సాక్షి, హైదరాబాద్: బంగారం.. మత్తుమందులు.. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఈ జాబితాలోకి ఇప్పుడు సిగరెట్లు కూడా చేరిపోయాయి. సాధారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులన్నీ కాస్ట్‌లీగానే ఉంటాయి. కానీ సిగరెట్ల దగ్గరికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. తక్కువ ధర.. చీప్ సిగరెట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి రాష్ట్రంలో పడుతున్నాయి. ఇవికాస్తా.. రూపాయికే సిగరెట్ పేరిట.. పేద, మధ్యతరగతి వర్గాలు, కాయకష్టం చేసుకునే కూలీలు, కార్మికులే లక్ష్యంగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సుంకాలు, రాష్ట్ర అమ్మకం పన్ను చెల్లించకుండా యథేచ్ఛగా పాన్‌డబ్బాలకు చేరిపోతున్నాయి. బంగ్లాదేశ్, మలేసియాలో తయారయ్యే ఈ ఘాటైన సిగరెట్లకు రాష్ట్రంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా వ్యాపారులు దొంగ మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తాజాగా నిర్వహించిన దాడులతో సిగరెట్ దందా వెలుగులోకి వచ్చింది.
 కోల్‌కతా మీదుగా దేశంలోకి..: తక్కువ ధరలో లభించే ఈ సిగరెట్లు విదేశాల నుంచి రాష్ట్రానికి అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. బంగ్లాదేశ్, మలేసియా నుంచి కోల్‌కతా మీదుగా దేశంలోకి వస్తున్న ఈ సిగరెట్లు ప్రైవేటు బస్సులు, రైలు మార్గాలతో పాటు ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. ఎలాంటి పన్నులూ చెల్లించకుండా తరలిస్తున్న ఈ సిగరెట్లను బేగంబజార్‌లోని మూడు ఏజెన్సీలు దిగుమతి చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. ఇటీవల వాణిజ్యపన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేసిన దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. బహిరంగ మార్కెట్‌లో సిగరెట్ ప్యాకెట్ల ధరలు భారీగా పెరగడం, సిగరెట్లపై 20 శాతం వ్యాట్ విధిస్తుండడంతో బంగ్లాదేశ్, మలేసియాల నుంచి వచ్చే ఘాటైన సిగరెట్లకు డిమాండ్ పెరిగింది. వివిధ కంపెనీల పేర్లతో రూపాయికి ఒక సిగరెట్ చొప్పున రూ.10కే ప్యాకెట్ లభిస్తుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు, కాయకష్టం చేసుకునే కూలీలు, కార్మికులు వీటికి అలవాటుపడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని బేగంబజార్‌కు చెందిన పలువురు వ్యాపారులు కొన్నేళ్లుగా బస్సులు, రైళ్ల ద్వారా సిగరెట్లను దర్జాగా రవాణా చేస్తున్నారు. చేపల కోసం కోల్‌కతా నుంచి వచ్చే ట్రక్కుల ద్వారా కూడా సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చే ఈ సిగరెట్ ప్యాకెట్లను భారతీయ కంపెనీల సిగరెట్లతో కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు రవాణా చేస్తున్నారు.
 దేశీయ సిగరెట్లు సైతం..
 ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో తయారయ్యే సిగరెట్లను కూడా పన్ను చెల్లించకుండా ఆయా కంపెనీలు హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ తనిఖీల్లో తేలింది. ఈ రాష్ట్రాల్లోని సిగరెట్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే ప్యాకెట్లను వివిధ మార్గాల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లు మూసుకుంది. విదేశీ, దేశీయ సిగరెట్ల జీరో దందాపై ఇటీవల వాణిజ్యపన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నిఘా పెంచడంతో మూడు ఏజెన్సీల్లో రూ. లక్షల విలువైన సిగరెట్ పాకె ట్లు లభించాయి. ప్రియా నావెల్టీస్, మహేష్ ట్రేడర్స్, పూజ ఏజెన్సీస్‌కు చెందిన గోడౌన్లలో వీటిని
 
  అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సిగరెట్లపై పన్ను, అపరాధరుసుము కింద సుమారు రూ. 15 లక్షలు వసూలు చేసి.. నామమాత్రపు కేసులు నమోదు చేసి వదిలేశారు. ఈ సందర్భంగా ఓ గోడౌన్‌ను కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
 20 శాతం వ్యాట్ చెల్లిస్తున్న బడా కంపెనీలు
 ఐటీసీతో పాటు ఇతర సిగరె ట్ కంపెనీలు ప్రతి సిగరెట్ విక్రయంపై ప్రభుత్వానికి 20 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గుట్కాలను కేంద్రం నిషేధించడంతో వీటిపై వచ్చే పన్ను నిలిచిపోయింది. అయినా గుట్కాల అమ్మకాలు మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అక్రమంగా దిగుమతి అవుతున్న రూపాయి సిటరెట్ల వల్ల ప్రభుత్వానికి సిగరెట్లపై వచ్చే పన్ను ఆదాయం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పన్ను చెల్లించే బడా కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వాణిజ్యపన్నుల శాఖ అధికారులు రూపాయి సిగరెట్ల గుట్టును రట్టు చేశారు.

మరిన్ని వార్తలు