ప్రముఖ మార్పిడి ఆపరేషన్ నిపుణుడు
డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే
గుంటూరు మెడికల్ : వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాడీ అండ్ ఆర్గాన్ డోనార్స్ అసోసియేషన్ గుంటూరు యూనిట్, గుంటూరు జీజీహెచ్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు జరిగింది. తొలుత గుంటూరు వైద్య కళాశాల నుంచి జీజీహెచ్ వరకు అవయవదానంపై అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం ఆస్పత్రిలోని శుశ్రుతా హాలులో జరిగిన సదస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గుండె మార్పిడి ఆపరేషన్ నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను ఘనంగా సన్మానించారు. అనంతరం గోఖలే మాట్లాడుతూ ప్రజల్లో నేటికీ అవయవదానంపై చాలా అపోహలు ఉన్నాయని, వాటిని విడనాడి అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అవయవదానంతో మరణానికి చేరువలో ఉన్న చాలా మందిని రక్షించవచ్చన్నారు. గుంటూరు వైద్య కళాశాల వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ మెండా ఫర్నికుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రమణ యశస్వి, లంకపల్లి శ్రీనివాస్, టి.శ్రీనివాస్, కొండా శివరామిరెడ్డి, మంగాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.