‘పట్టిసీమ’పై చర్చకు సిద్ధమే

31 Jan, 2017 23:31 IST|Sakshi
  • సమయం, స్థలం చెప్పండి
  • అన్ని వివరాలతో వస్తా... వివరిస్తా
  • మంగళవారం రావల్సిన కమిటీ పర్యటన ఎందుకు రద్దు  చేసుకుందో ఆ లెక్కా తేలుస్తాఅదే రోజు జరగాల్సిన అంచనా కమిటీ ఎటుపోయిందో కూడా చెబుతా
  • ఎమ్మెల్యే గోరంట్ల చేసిన సవాల్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి ప్రతి సవాల్‌
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిరుపయోగమైందా? లేకా ఉపయోగమైందా? అన్న అంశంపై జరిగే చర్చకు సమయం, స్థలం నిర్ణయించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాజమహేంద్రవరం రూరల్‌ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సవాల్‌ విసిరారు. గతంలో పలు విలేకర్ల సమావేశాల్లో ‘పట్టిసీమ’ బోగస్‌ పథకమని, ప్రత్యేక ప్యాకేజీ ఒక బ్రహ్మ పదార్థమని ఉండవల్లి సాదాహరణంగా ఆరోపించారు.
    తన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే టీడీపీ నేతలకు బహిరంగ క్షమాపణలు చెబుతానని ప్రకటించారు. సోమవారం విలేకర్ల సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ‘పట్టిసీమ’ ‘ప్రత్యేక ప్యాకేజీ’లపై ఉండవల్లి ఆరోపణలను ఖండిస్తూ ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటిస్తూనే ఉండవల్లిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోరంట్ల సవాల్‌పై మంగళవారం ఉండవల్లి స్పందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ప్రత్యేక ప్యాకేజీపై చర్చకు సమయం, స్థలం చెప్పాలని కోరుతూ గోరంట్లకు బహిరంగ లేఖ రాశారు. పట్టిసీమ ప్రాజెక్టు ఏవిధంగా నిరుపయోగమైనదో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలతో సహా మీ ముందుంచడానికి సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవే కాకుండా పోలవరం ప్రాజెక్టు విషయమై మంగళవారం జరగాల్సిన ‘అంచనా కమిటీ’ సమావేశాన్ని, మంగళవారం ప్రాజెక్టు పరిశీలనకు రావాల్సిన కమిటీ పర్యటనను రద్దు చేయాడానికి గల కారణాలను కూడా గోరంట్ల బుచ్చయ్య ముందు ఉంచడానికి తాను రెఢీగా  ఉన్నానని సవాల్‌ విసిరారు.
     
మరిన్ని వార్తలు