- నోట్లు చెల్లవని చెప్పే హక్కు ఎవరికీ ఉండదు
- మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి
ఆళ్లగడ్డ : ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను చెల్లుబాటు కావని చెప్పే హక్కు ఎవరికీ ఉండదని మాజీ ఎంపీ గంగులప్రతాపరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్లు విడుదల చేసే సమయంలో ప్రతి నోటుపై ఈ నోటు విలువ తగ్గకుండా చూసే బాధ్యత మాది అని ప్రమాణం చేసి రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుందన్నారు. అంటే ఈ నోటు విలువతో ప్రభుత్వం బాండు రాసిచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. అలాంటి నోట్లు చెల్లవని చెప్పేందుకు రాజ్యంగాం ప్రకారం ఎవరికీ హక్కు లేదన్నారు. దొంగనోట్లు తప్ప దేశంలో చెలామనిలో ఉన్న నోట్లన్నీ రిజర్వు బ్యాంకు ముద్రించినవేనని, ప్రతి నోటుకు నోటు బదులు ఇచ్చేందుకు కావలసినంత గడువు ఇవ్వాల్సిందేనన్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా నోట్లు రద్దు చేయడంతో సామాన్యులు నానా యాతన పడుతున్నారన్నారు. దేశంలో అత్యధికులు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, నిరక్ష్యరాస్యులేన్నారని, ఇలాంటి దేశంలో ఒక్కసారిగా మార్పు తీసుకురావాలనుకోవడం కుదరదన్నారు. ప్రజలు తిరగబడలేదు, వారిలో అలజడి లేదనుకుంటే పొరపాటన్నారు. ప్రజలు సహనం కోల్పోయి ఆగ్రహానికి గురైతే వారిని అదుపు చేయడం, వ్యవస్త చిన్నాభిన్నమైతే సరిదిద్దడం ఎవరితరము కాదనే విషయం తెలుసుకోవాలని గంగుల పేర్కొన్నారు.