పోలీసు స్టేషన్‌కు చేరిన మధుప్రియ ప్రేమ వ్యవహారం

30 Oct, 2015 09:06 IST|Sakshi
పోలీసు స్టేషన్‌కు చేరిన మధుప్రియ ప్రేమ వ్యవహారం

వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ‘ఆడపిల్లనమ్మా...’ పాటతో గాయనిగా ప్రాచుర్యం పొందిన మధుప్రియ ప్రేమ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన మంగి శ్రీకాంత్‌తో మధుప్రియ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. నెల రోజుల క్రితమే మేజర్ అయిన మధుప్రియ.. ఇక శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20కి వీరిద్దరికీ పెళ్లి చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, వీళ్ల పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. కానీ, పెళ్లివైపే మొగ్గుచూపిన మధుప్రియ.. రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 11.20 నిమిషాలకు పెళ్లి చేసేందుకు నిర్ణయించిన శ్రీకాంత్ తల్లిదండ్రులు ఈ మేరకు శుభలేఖలు కూడా పంచారు. దీంతో మధుప్రియ బంధువులు శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి అంగీకరించేది లేదని, పెళ్లి జరగనివ్వబోమని చెప్పినట్లు తెలిసింది.


పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఆమె ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి  పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. గురువారం అర్ధరాత్రి సమయంలో మధుప్రియ తల్లిదండ్రులు కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటి వద్దకు చేరుకుని గొడవ చేయడంతో ప్రేమ జంట డీఎస్పీ చక్రవర్తిని ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అనంతరం వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ చేశారు. అయితే తాము మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకుంటామని మధుప్రియ, శ్రీకాంత్ వాదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వీళ్ల పెళ్లిపై ఇరువైపులా బంధువులు పోలీసు స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు.

మధుప్రియ కుటుంబం హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసం ఉంటుంది. అక్కడే ఆమెకు శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్. మధుప్రియ, శ్రీకాంత్ ఇద్దరూ మేజర్లు కావడం, వాళ్లకు పెళ్లి చేసుకోవడం ఇష్టం కావడంతో వాళ్ల పెళ్లికి తమకు అభ్యంతరం ఏమీ లేదని డీఎస్పీ చక్రవర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు