భార్య, మామపై అల్లుడి హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

భార్య, మామపై అల్లుడి హత్యాయత్నం

Published Wed, Sep 27 2023 1:34 AM

- - Sakshi

వైఎస్సార్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేస్తుండగా అడ్డొచ్చిన మామపై కూడా అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ గాయత్రి కథనం మేరకు వివరాలు.. మండలంలోని దేవులచెరువు పంచాయతీ రాజుగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్‌, వసంతమ్మ కుమార్తె అపూర్వ(25)కు అదే గ్రామానికి చెందిన దేవరాజుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.

వీరంతా అపూర్వ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం టమాట డబ్బులు రూ. 2 లక్షలు అల్లుడు వాడుకున్నాడని మామ చంద్రశేఖర్‌ అడగడంతో అప్పుల వాళ్లకు కట్టినట్లు చెప్పాడు. డబ్బుల విషయమై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో అత్తామామల ఇంట్లో ఉండకుండా భార్య, పిల్లలతో దేవరాజు వేరుగా కాపురం పెట్టాడు. డబ్బుల విషయంపై తరచూ దేవరాజుకు, అతని భార్య అపూర్వకు మధ్య గొడవ జరిగేది. దీంతో రెండు రోజుల క్రితం ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. డబ్బు విషయమై తనను అవమానించారని భార్య, మామపై కక్ష పెంచుకున్న దేవరాజు తన భార్య అపూర్వ పొలం వద్ద పనులు చేసుకుంటుండగా ఆమైపె కత్తితో దాడికి దిగాడు.

గమనించిన మామ చంద్రశేఖర్‌ అడ్డురావడంతో మామపై కూడా దాడిచేసి పారిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం తంబళ్లపల్లె పీహెచ్‌సీకి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో తిరుపతికి తరలించారు. సీఐ శివాంజనేయులు రాజుగారిపల్లెకు వెళ్లి జరిగిన సంఘటనపై విచారించారు. అపూర్వ తల్లి వసంతమ్మ ఫిర్యాదుతో దేవరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement