భట్టిప్రోలు: భట్టిప్రోలు 9వ వార్డులోని భోగేశ్వరపేటలోని ఓ ఇంటి వరండాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ ఆర్.రవీంద్రారెడ్డి కథనం ప్రకారం వెల్లటూరుకు చెందిన సజ్జా రాము(22) వివాహాది శుభకార్యాలకు మండపాలు కడుతూ జీవనం కొనసాగించేవాడు. ప్రతి రోజూ వెల్లటూరు నుంచి భట్టిప్రోలు వస్తూ, వెళుతుండేవాడు. ఈ నేప«థ్యంలో స్థానిక భోగేశ్వరపేటలోని కౌతరపుసాంబశివరావు ఇంటి వరండాలో ఇతను అచేతనుడై పడి ఉండడాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు.