-

తుపాకీతో దుండగుల హల్‌చల్

14 Jul, 2016 03:52 IST|Sakshi

నల్లగొండ జిల్లాలో ఘటన... సినీఫక్కీలో దుండగుల పరార్

 తుర్కపల్లి : నల్లగొండ జిల్లాలో బుధవారం దుండగులు తుపాకీ చూపించి హల్‌చల్ సృష్టించారు. అనంతరం పోలీసుల కళ్లుగప్పి సునాయూసంగా తప్పించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కీసర వైపు నుంచి వస్తున్న డీసీఎం వాహనాన్ని దుండగులు స్కూటీపై వెంబడించి తుర్కపల్లి మాదాపూర్ వద్ద ఓవర్ టేక్ చేసి తుపాకీతో రోడ్డు మీద అడ్డంగా నిలుచున్నారు. దీంతో భయాందోళన చెందిన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తుర్కపల్లి వైపునకు వెళ్లాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత టీఆర్‌ఎస్ మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తోంది. అక్కడ ఎస్కార్ట్ పోలీసులు మాత్రం గేటు బయట నిలబడి ఉండడంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని నిలిపి జరిగిన విషయాన్ని అక్కడి పోలీసులకు తెలిపాడు. అక్కడికి వచ్చిన దుండగులు పోలీసులను చూసి కంగుతిన్నారు. వెంటనే హైదరాబాద్ వైపు స్కూటీని మళ్లించి పరారయ్యారు.   

 పోలీసులు భయపడ్డారా?: దుండగులను సునాయసంగా పట్టుకునే ఆవకాశం ఉంది. అయితే వారి వద్ద తుపాకీ ఉండడంతో భయపడి పోలీసులు పట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే దారిలో బొమ్మల రామారం, కీసర పోలీసులకు సమాచారం అందించినా దుండగులు దొరికే ఆవకాశం ఉండేది. సమాచారం అందించిన డీసీఎం డ్రైవర్ వివరాలు కూడా పోలీసుల వద్ద లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు