త్యాగధనులను స్మరించుకుందాం

11 Sep, 2016 22:57 IST|Sakshi
త్యాగధనులను స్మరించుకుందాం
  • మజ్లీస్‌ చేతిలో కీలుబొమ్మగా ప్రభుత్వం
  • బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ధ్వజం
  • బోధన్‌:
    దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ, వారు చూపిన బాటలో నడుద్దామని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మజ్లీస్‌ చేతిలో టీఆర్‌ఎస్‌ సర్కారు కీలుబొమ్మగా మారిందని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారికంగా విమోజన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం బోధన్‌లో నిర్వహించిన తిరంగ యాత్ర ర్యాలీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరిస్తూ, వారి త్యాగాలను భావితరాలకు చాటిచెప్పాలనే లక్ష్యంతోనే తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. 
    మజ్లీస్‌ ప్రభావంతోనే..
    సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని, కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి గత ప్రభుత్వాలు ఇక్కడ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారికంగా నిర్వహిస్తారని భావిస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వాల బాటలోనే నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మజ్లీస్‌ పార్టీ నేతలను భుజాన మోస్తోందని, ఆ పార్టీ కనుసన్నల్లోనే పాలన సాగుతోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
    మాట తప్పిన కేసీఆర్‌
    తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో డిమాండ్‌ చేసిన సీఎం కెసీఆర్‌ అధికారంలోకి రాగానే మాట మార్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా అడ్డు పడుతోందన్నారు. తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉందని, నిజాం నిరంకుశ పాలన, రజకార్ల అకృత్యాలకు వందలాది మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వందలాది మంది త్యాగల చరిత్ర కలిగిన సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17న వరంగల్‌లో విమోదచన దినోత్సవ సభ తలపెట్టామని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హాజరవుతారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నేతలు అడ్లూరి శ్రీనివాస్, మురళీధర్‌గౌడ్, నర్సింహారెడ్డి, ఉమాశంకర్, శివప్ప, సుభాష్, బాపురెడ్డి, లింగం, రాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు