ప్రియుడితో కలిసి భర్త హత్య

29 Mar, 2017 15:30 IST|Sakshi
ప్రియుడితో కలిసి భర్త హత్య

నిజామాబాద్‌ రూరల్‌ (నిజామాబాద్‌ అర్బన్‌):
వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భార్య, భర్త ను దారుణంగా చంపిన ఘటన మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తానాఖూర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి  గ్రామానికి చెందిన గీత కార్మికుడైన వెల్పూర్‌ సాయిలు (38) హత్యకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సాయిలు స్వగ్రామానికి వచ్చి పదిరోజులైంది. భర్త విదేశాలకు వెళ్లడంతో సాయిలు భార్య నీలావతి అలియాస్‌ లీలా గ్రామానికి చెందిన తిరుపతి రమేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

వివాహేతర సంబంధం విషయంలో లీలావతి, సాయిలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పథకం ప్రకారం సోమవారం రాత్రి తిరుపతి రమేశ్, లీలావతి కలిసి సాయిలును ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశారు. మంచంపై పడుకోబెట్టి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బయట నుంచి ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఉదయం ఇంట్లో నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక దళ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి  మంటలు ఆర్పారు. అప్పటికే మంచంతో పాటు సాయిలు మృతదేహం పూర్తిగా కాలిపోయింది.

ఇంట్లో వస్తువులు, దుస్తులు బూడిదయ్యాయి. హతుడికి 6వ, 7వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్‌ రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సతీశ్‌ సందర్శించారు. నిందితులు ఇరువురు పరారీలో ఉన్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు