ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

29 Mar, 2016 20:34 IST|Sakshi
ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

- పెళ్లికి అడ్డు పడుతుందేమోనని ప్రియుడి ఘాతుకం
- గుంటూరు జిల్లాలో ఘటన


వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటిగా జీవించాలనుకున్నారు. అయితే మతాలు వేరుకావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో ప్రేమికులు 'బలవంతంగా' విడిపోయారు. కొంతకాలానికి ఆ ఇద్దరి మధ్య మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఇంతలోనే ప్రియుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది. అటు ప్రియురాలి నుంచి ఫోన్ కాల్స్ ఉదృతీ పెరిగింది. దీంతో పెళ్లికి అడ్డువస్తుందేమోనని ప్రియురాలిపై ఘాతుకానికి ఒడిగట్టాడా ప్రియుడు. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

పట్టణానికి చెందిన ఓ యువతి గోతాల కంపెనీలో కూలీగా పనిచేస్తోంది. ఏడునెలల కిందట పట్టణానికే చెందిన ఆటోడ్రైవర్ రహీమ్‌తో ఫోన్ ద్వారా ఆమెకు పరిచయమైంది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలియడం, పెళ్లికి అంగీకరించకపోవడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలే రహీమ్‌కు మరో యువతితో వివాహం నిశ్చయమైంది.

మాజీ ప్రేమికురాలు మళ్లీ ఫోన్ కాల్స్ చేస్తే తన పెళ్లికి అటంకం కలుగుతందనుకున్న రహీమ్.. సోమవారం సాయంత్రం స్నేహితులు రషీద్, వెంకటేశ్వర్లు, వెంకటేష్‌ లతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. పథకం ప్రకారం వారు ముందుగా రెస్టారెంట్‌లో మద్యం సేవించి, పని ముగించుకుని 7గంటల సమయంలో ఇంటికి వెళుతున్న యువతిని మార్గమధ్యంలో అడ్డగించి, ఆటోలో ఎక్కించుకుని దేవరంపాడు పొలాల వైపు తీసుకువెళ్లారు. అక్కడ యువకులు ఆమెను దుర్భాషలాడి అత్యాచారం జరిపి కొట్టారు.

అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా ఇంటికి వెళ్లి విషయాన్ని పెద్దలకు చెప్పింది. బాధిత యువతి మంగళవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి పట్టణ ఇన్‌చార్జి సీఐ శ్రీధర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు పంపిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరుకు పంపించినట్లు సీఐ తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు