ఇక స్కాటెగ్జిట్...?

29 Jun, 2016 07:32 IST|Sakshi
ఇక స్కాటెగ్జిట్...?

బ్రెగ్జిట్ ప్రకంపనలు సద్దుమణగడం ప్రారంభం కాకముందే బ్రిటన్ పలు విధాలుగా రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పర్యవసానాలు బ్రిటన్ సరిహద్దులను దాటి, ఐరోపా ఖండం అంతటికీ వ్యాపిస్తాయేమోననే ఆందో ళన  సైతం వ్యక్తమౌతోంది. ఈయూ సభ్యత్వంపై మరోమారు ప్రజాభిప్రాయసేక రణ జరపాలనే ఒత్తిడి పెరుగుతుండగా, స్కాట్లాండ్ ప్రథమ మంత్రి నికోలా స్టర్జన్ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుతూ మరోమారు ప్రజాభిప్రాయసేకరణ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటించారు. స్కాటెగ్జిట్‌కు అనుకూలంగా స్కాట్లు మొగ్గుతున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకున్నా స్కాట్లాండ్ మాత్రం కొనసాగడానికి తగు ఏర్పాట్లు చేయాలనే తన వాదనను అది లగ్జెంబర్గ్‌లో జరిగిన ఈయూ కౌన్సిల్ సమావేశానికి విన్నవించింది. బ్రిటన్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా ఉన్న స్కాట్లాండ్‌కు విడిగా ఈయూలో సభ్యత్వాన్ని కొనసాగించడం సాధ్యం కాదనే చెప్పాలి.

ఇంగ్లిష్ వారి ఆధిపత్యం పట్ల స్కాటిష్ ప్రజలకున్న అసం తృప్తికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ జాతీయ ఆకాంక్షల ఆధారంగానే స్టర్జన్ నేతృ త్వంలోని స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని చాలా కాలంగా డిమాండు చేస్తోంది. 2014లో స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో 55 శాతం బ్రిటన్‌లో భాగంగా ఉండాలని కోరుకున్నారు. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం అంటే ఈయూలో సభ్యత్వాన్ని కోల్పోవడమనే వాదన ఆనాడు ఐక్యతావాదుల ప్రధాన అస్త్రం అయింది. బ్రిటన్ పౌరులుగా కంటే ఈయూ పౌరులుగా తమ అస్తిత్వానికి ఎక్కువ విలువనిచ్చే స్కాట్లు ఈయూ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనే ఐక్యతావాదుల వైపు మొగ్గు చూపారు. అలాగే బ్రెగ్జిట్ ఓటింగ్‌లో కూడా ఈయూ సభ్యత్వానికి అనుకూలంగా వారు 62 శాతం మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే స్టర్జన్ ఏది ఏమైనా స్కాట్లాండ్ ఈయూలో సభ్యత్వాన్ని కొనసాగిస్తుందని, స్వాతంత్య్రం కోసం మరోమారు ప్రజాభిప్రాయసేకరణకు వెళ తామని ప్రకటిస్తున్నారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్‌తో సైతం చర్చిస్తున్నారు.

2014 స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ మౌనం వహించింది. బ్రెగ్జిట్ తదుపరి కూడా అది అదే వైఖరిని అనుసరిస్తుందా అని చెప్పలేం. కానీ జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్ ముఖ్య మిత్రపక్షానికి చెందిన సీనియర్ సెనేటర్ గుంథర్ క్రిచ్‌బామ్ ‘‘బ్రిటన్ నిష్ర్కమించినా ఈయూ సభ్యత్వం 28గానే ఉంటుంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం కొత్తగా ప్రజాభిప్రాయసేకరణను కోరుతుంది, అది ఎలాగూ నెగ్గుతుంది’’ అని చేసిన వ్యాఖ్యలు బ్రెగ్జిట్ తదుపరి కొందరు ఈయూ ప్రముఖుల ఆలోచనా సరళిలో వచ్చిన మార్పును సూచిస్తుంది. ఇదిలా ఉండగా బ్రిటన్‌లోని మరో స్వయంప్రతిపత్తి ప్రాంతం ఉత్తర ఐర్లాండ్‌లో సైతం బ్రిటన్ నుంచి విడిపోయి, ఐర్లాండ్‌లో ఐక్యం కావాలనే డిమాండు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఓటింగ్ లో స్కాట్లలాగే ఐరిష్ ప్రజలు కూడా ఈయూ సభ్యత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా ఓటు చేశారు. స్కాట్లలాగే, ఐరిష్ ప్రజలకు కూడా బ్రిటన్‌తో ఉన్న వైషమ్యాలు చారిత్రకమైనవి. ఉత్తర ఐర్లాండ్‌లోని ఐఆర్‌ఏ తిరుగుబాటు 1997కుగానీ సద్దుమణగ లేదు.

2014లో స్కాట్లాండ్ స్వాతంత్య్రం ప్రజాభిప్రాయం తమ వంటి దేశాలలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తుందని స్పెయిన్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెగ్జిట్ తదుపరి స్పెయిన్‌లోని కెటలోనియా స్వాతంత్య్రం డిమాండు ఊపందుకుంటోంది. గత ఏడాది కెటలోనియన్ పార్టీలు నిర్వహించిన అనధికారిక ప్రజాభిప్రాయసేకరణలో 80 శాతం కెటలోనియన్లు స్వాతంత్య్రం కోరారు. స్పెయిన్ నుంచి విడిపోయినా సంపన్న వంతమైన కెటలోనియాను ఈయూ వదులుకోదని స్వాతంత్య్రవాదులవాదన. గ్రీస్, పోర్చుగల్, ఇటలీలలాగే స్పెయిన్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. 21 శాతం నిరుద్యోగంతో దారీతెన్నూ లేని స్థితిలో ఉంది. పైగా 1975లో ఫ్రాంకో మరణానంతర పరిస్థితికి మించిన తీవ్ర రాజకీయ ప్రతిష్టంభనలో కొట్టుమిట్టాడుతోంది.
స్పానియార్డులు ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో కూడా గత డిసెంబర్‌లోలాగే ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితిని పునరావృతం చేశారు. ఏకైక  ప్రధాన పార్టీగా తిరిగి అవతరించిన పాప్యులర్ పార్టీ నేత ప్రధాని మరియానో రజాయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ పరిస్థితుల్లో కెటలోనియన్ స్వాతంత్య్రం డిమాండు తిరిగి తెరపైకి వస్తోంది. బ్రెగ్జిట్, కెటలోనియన్లలోనే కాదు, దూరంగా ఉన్న కెనడాలోని క్యుబెక్ జాతి స్వాతంత్య్ర కాంక్షలకు సైతం కొత్త ఊపిరు లూదుతోంది.

ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత యూరప్ నిర్మాణమనే ఈయూ మౌలిక లక్ష్యానికి బ్రెగ్జిట్ పర్యవసానంగా విషమిస్తున్న జాతి వైరుధ్యాలు సవాలుగా నిలుస్తున్నాయి. జాతీయవాదం, జాత్యహకారవాదం, గుడ్డి ముస్లిం వ్యతిరేకత, వల సదార్లపట్ల వ్యతిరేకత వంటి ధోరణులు బలపడుతుండటం దేశాలకు, జాతులకు అతీతంగా యూరప్‌ను ఆర్థికంగా, రాజకీయంగా ఐక్యం చేయాలనే దాని ఆకాంక్షకు అపవా దంగా నిలుస్తున్నాయి. బ్రెగ్జిట్ ఫలితాల తదుపరి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, జర్మనీ తదితర దేశాల్లోని పచ్చి మితవాద పార్టీలు ఈయూ నుంచి నిష్ర్కమణకు ప్రజాభిప్రాయ సేకరణలు జరపాలని కోరడం ప్రారంభిం చాయి. ఫ్రెగ్జిట్ (ఫ్రాన్స్), నెగ్జిట్ (నెదర్లాండ్స్) వంటి పిలుపులు వెల్లువెత్తుతు న్నాయి. ఇవన్నీ నేడు బలహీన ధోరణులే అయినా ఈయూ ఆర్థిక  విధానాలను, అది ప్రజలపై అమలు చేసిన, చేస్తున్న కఠోరమైన పొదుపు చర్యలు, సంక్షేమ వ్యయాల కోతల పర్యవసానాలుగా ఉత్పన్నమవుతున్నాయి.

ఫలితంగా తలెత్తుతున్న సామాజిక అసంతృప్తికి యూరప్‌కు వలస వచ్చేవారు బలిపశువులు అవుతుండటం విషాదకరం. 2011-12లలోని ఈయూ సంక్షోభం పరిష్కారం కాకపోవడమే స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి జాత్యహంకార, విచ్ఛిన్నకర, విధ్వంసకర ధోరణుల వరకు అన్ని అవాంఛనీయ ధోరణులకు ఊపిరులు పోస్తోంది. ‘చారిత్రక శత్రువులు ఎలా సన్నిహిత భాగస్వాములు కాగలరో ఈయూ నిరూపించి చూపించింది’ అని నోబెల్ కమిటీ 2012లో ఈయూకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ పేర్కొంది. నేటి పరిణామాలు ఆ మాటలను అపహాస్యం చేస్తున్నట్టుండమే వైచిత్రి. ఐరాపా సంయుక్త రాష్ట్రాలను ఏర్పరచాలనే ఈయూ వ్యవస్థాపకుడు జీన్ మన్నెన్ కల నిజమౌతున్నదా? కరిగిపోనున్నదా?

మరిన్ని వార్తలు