స్క్రీన్‌ టైమ్‌ తగ్గితే  మార్కులు పెరుగుతాయి!

28 Sep, 2018 00:52 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ల ముందు పిల్లలు గడిపే సమయాన్ని రోజుకు రెండు గంటలకు పరిమితం చేయగలిగితే పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు అమెరికన్‌ శాస్త్రవేత్తలు. దీంతోపాటు తగినంత శారీరక వ్యాయామం, నిద్ర కూడా అవసరమేనని వీరు తేల్చారు. అమెరికాలోని దాదాపు ఐదు వేల మందిపై తాము పరిశోధన చేశామని  డాక్టర్‌ జెరెమీ వాల్‌‡్ష తెలిపారు. అమెరికన్‌ పిల్లలు రోజుకు 3.6 గంటలపాటు టీవీ, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల ముందు గడుపుతున్నారని చెప్పారు. ఇలా కాకుండా స్క్రీన్‌ టైమ్‌ను రెండు గంటలకు పరిమితం చేయడం పిల్లలతోపాటు కౌమార వయసులో ఉన్న వారికీ అత్యవసరమని చెప్పారు.

అమెరికాలో ప్రతి 20 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ పద్ధతులు పాటిస్తున్నారని చెప్పారు. స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించి నిద్రపోయే సమయాన్ని పెంచడం ద్వారా మెదడు బాగా పనిచేస్తున్నట్లు తెలిసిందని, శారీరక వ్యాయామం ప్రభావం నేరుగా మెదడుపై పెద్దగా లేదని వివరించారు. ఎనిమిది నుంచి 11ఏళ్ల మధ్య వయసు పిల్లలు రోజుకు కనీసం తొమ్మిది గంటలపాటు నిద్రపోవడం మేలని సూచించారు. నిద్ర, స్క్రీన్‌టైమ్‌ తగ్గడాల ఫలితం మార్కుల్లో కనిపిస్తూంటే.. వ్యాయామం ప్రభావం దష్టి కేంద్రీకరించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, రియాక్షన్‌ టైమ్‌లపై కనిపిస్తున్నట్లు అధ్యయనంలో తెలిసిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు