ఓ మోస్తరు పిండిపదార్థాలతో మెరుగైన ఆరోగ్యం...

25 Aug, 2018 00:43 IST|Sakshi

పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని.. కొన్ని రకాల వ్యాధులకు చికిత్స లభిస్తుందన్న ప్రచారం ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నప్పటికీ ఓ మోస్తరు స్థాయిలో కార్బోహైడ్రేట్లను ఆహారంలో చేర్చుకోవడమే మేలని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం ఆహారం ద్వారా శరీరానికి అందే శక్తిలో 40 శాతం కంటే తక్కువ కార్బోహైడ్రేట్ల ద్వారా వస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశముండగా, 50 – 55 శాతం శక్తి వస్తే మెరుగయ్యే అవకాశముంది. అమెరికాలో దాదాపు 15 వేల మందిపై జరిపిన అధ్యయనంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంకో 4.3 లక్షల మంది వివరాల విశ్లేషణ ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు బోస్టన్‌లోని బ్రైగమ్‌ అండ్‌ విమెన్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్త సారా సెడిల్‌మ్యాన్‌ తెలిపారు.

జంతు సంబంధిత ఆహారంతో కార్బోహైడ్రేట్లను తగ్గించినప్పుడు జీవిత కాలం తగ్గే అవకాశముందని తమ పరిశోధన చెబుతోందని,  బదులుగా మొక్కల నుంచి అందే కొవ్వులు, ప్రొటీన్లను, ఓ మోస్తరుగా కార్బోహైడ్రేట్లను చేర్చడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తక్కువ కార్బోహైడ్రేట్ల ఆహారం స్వల్పకాలంలో ప్రయోజనం కల్పించినా.. ఎక్కువ కాలం వాడినప్పుడు మాత్రం సమస్యలు సృష్టించే అవకాశముందన్నారు.  

మరిన్ని వార్తలు