సూదుల బెడద తప్పించే కాగితం సెన్సర్లు...

27 Dec, 2018 01:05 IST|Sakshi

పరి పరిశోధన

రక్తంలోని గ్లూకోజు మోతాదులను గుర్తించేందుకు రోజూ సూదులతో గుచ్చుకుంటున్నారా? మీ కష్టం ఇంకొంత కాలం మాత్రమే. ఎందుకంటే సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు కాగితం సెన్సర్లతోనే ఈ పని కానిచ్చేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన సాహికా ఇనాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో వ్యక్తుల లాలాజలం ఆధారంగానే గ్లూకోజు మోతాదు నిర్ధారణ అవడం ఇంకో విశేషం. సాధారణ ఇంక్‌ జెట్‌ ప్రింటర్‌లో వాడే ఇంక్‌కు విద్యుత్తు ప్రసార సామర్థ్యమున్న ప్లాస్టిక్‌ను కలపడం ద్వారా ఈ కాగితం సెన్సర్ల తయారీ మొదలవుతుంది.

ఈ ఇంకుతో కాగితంపై ఎలక్ట్రోడ్‌లను ముద్రించడం.. దానిపై గ్లూకోజ్‌ ఆక్సిడేజ్‌ ఎంజైమ్‌ను ఒక పూతగా పూయడంతో.. ఈ రెండింటిపై నాఫియన్‌ పాలిమర్‌ తొడుగు ఒకటి ఏర్పాటు చేయడంతో సెన్సర్‌ తయారీ పూర్తవుతుంది. ఈ సెన్సర్లపై లాలాజలం చేరినప్పుడు అందులోని గ్లూకోజ్‌ కాస్తా గ్లూకోజ్‌ ఆక్సిడేజ్‌తో చర్య జరుపుతుంది. ఫలితంగా పుట్టిన విద్యుత్‌ సంకేతాన్ని ఎలక్ట్రోడ్‌లు గుర్తిస్తాయి. సంకేతపు తీవ్రతను బట్టి శరీరంలోని గ్లూకోజ్‌ మోతాదును నిర్ధారిస్తారు. ఈ సెన్సర్లను కనీసం నెలరోజులపాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలు, తీగల్లాంటివి లేకుండా చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నామని.. సెన్సర్లను మరింత సమర్థంగా పనిచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సాహికా ఇనాల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు