కేంద్ర ప్రభుత్వ కొలువులుః ఎస్‌ఎస్‌సీ

30 Mar, 2014 22:37 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ కొలువులుః ఎస్‌ఎస్‌సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాదిరిగానే.. క్రమం తప్పకుండా నియామక ప్రకటనలు విడుదల చేస్తూ ఉద్యోగార్థుల పాలిట కామధేనువుగా నిలుస్తోంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ). ఇది కేంద్ర ప్రభుత్వంలోని  వివిధ మంత్రిత్వశాఖలు, వాటి పరిధిలోని విభాగాలు, కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. దాదాపు ఈ పోస్టులన్నీ  గ్రూప్-బి, గ్రూప్-సి కేడర్‌కు చెందినవే. డిగ్రీ,  ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, పదోతరగతి అర్హతతో ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల ద్వారా ఏయే ఉద్యోగాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
 
 ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల ద్వారా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సీబీఐ, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఐటీబీపీ వంటి ప్రతిష్టాత్మక విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌గా అడుగుపెట్టొచ్చు. అదేవిధంగా ఇంటర్ అర్హతతో డేటాఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్, స్టెనోగ్రాఫర్స్ పోస్టులకు పోటీపడొచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాతో కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్‌గా కొలువుదీరొచ్చు.  కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ సంస్థలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ వంటి వాటి లో కానిస్టేబుల్ ఉద్యోగాలను, వివిధ కేంద్ర పభుత్వ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ పోస్టులను దక్కించుకోవచ్చు. ఇలా పదో తరగతి మొదలుకొని ఇంటర్, పాలిటెక్నిక్, బ్యాచిలర్ డిగ్రీ వరకూ.. ఏ కోర్సులు పూర్తిచేసినవారైనా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరై కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి..
 
 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్


 కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్-బి, గ్రూప్-సి స్థాయి  పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.


 ఉద్యోగాలివే...
 రాతపరీక్ష, ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా భర్తీ చేసే పోస్టులు:
  ఇన్‌స్పెక్టర్(ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, పోస్ట్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్)
     సబ్ ఇన్‌స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ))
     అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (డైరక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ)
     డివిజనల్ అకౌంటెంట్స్(కాగ్ పరిధిలోని వివిధ విభాగాల్లో)
     స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2
     అసిస్టెంట్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతోపాటు ఇతర మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాలు)
 
     రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేసే పోస్టులు:
     ఆడిటర్(కాగ్, సీజీడీఏ, సీజీఏ పరిధిలోని కార్యాలయాలు)
     అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్(కాగ్, సీజీఏ పరిధిలోని కార్యాలయాలు)
     అప్పర్ డివిజన్ క్లర్క్(కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖలు)
     ట్యాక్స్ అసిస్టెంట్(సీబీడీటీ, సీబీఈసీ), కంపైలర్(రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా)
     సబ్ ఇన్‌స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్)
 
 అర్హత:
 కంపైలర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
     

కంపైలర్ పోస్టులకు ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులకు స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
 
 వయోపరిమితి: అన్ని పోస్టులకు ప్రకటనలో సూచించిన విధంగా నిర్దేశించిన తేదీనాటికి వయసును కలిగి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (నిర్దేశిత తేదీనాటికి 26 ఏళ్లు మించరాదు)మినహా మిగతా అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.


 ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.


 రాత పరీక్ష: పోస్టులను బట్టి రాత పరీక్ష ఉంటుంది. టైర్-1 అందరికీ ఒకేలా ఉంటుంది. టైర్-2లో మాత్రం మార్పులు ఉంటాయి.
 
 వివరాలు..
 మొదటి దశలో నిర్వహించే టైర్-ఐ పరీక్షలో.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో మొత్తం 50 ప్రశ్నల చొప్పున 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి టైర్-2పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 కింద క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, పేపర్-2కింద ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, కంపైలర్ పోస్టులకు ఈ రెండు పేపర్లతోపాటు అదనంగా మూడో పేపర్(స్టాటిస్టిక్స్) ఉంటుంది. దీనికి కూడా 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. టైర్-1, టైర్-2 రెండు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. రెండు దశలు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి పోస్టులను బట్టి ఇంటర్వ్యూ/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
 దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో, ప్రకటన: ఫిబ్రవరిలో..
 
 స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్ సీ అండ్ డీ) ఎగ్జామినేషన్
 
 కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్ సీ అండ్ డీ) పోస్టుల భర్తీ కోసం ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తుంది.
 అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
 వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 18-27ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
 రాతపరీక్ష విధానం: ఇందులో భాగంగా ఒకే పేపర్ ఉంటుంది. మూడు పార్ట్‌లుగా ఉండే పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు)-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్(50 ప్రశ్నలు)-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (100 ప్రశ్నలు) - 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్
 విధానంలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
 స్కిల్ టెస్ట్: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి స్టెనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు.
 ప్రకటన: సెప్టెంబర్‌లో..
 
 కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) పరీక్ష

 
 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లోని వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్  (10+2) ఎగ్జామ్‌ను ఎస్‌ఎస్‌సీ నిర్వహిస్తోంది.  
 అర్హత: 10+2 ఉత్తీర్ణత.
 వయోపరిమితి: నిర్దేశించిన తేదీ నాటికి 18-27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
 ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాతపరీక్ష, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా..
 రాతపరీక్ష:
 ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు.
 
 స్కిల్ టెస్ట్: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటర్‌పై గంటకు 8,000 పదాలు(కీ డిప్రెషన్స్) టైప్ చేయాలి.
 టైపింగ్ టెస్ట్: లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల వారికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నిమిషానికి ఇంగ్లిష్ అయితే 35 పదాలు, హిందీ అయితే 30 పదాలు చొప్పున టైప్ చేయగలగాలి.
 స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్టులు కేవలం అర్హత కోసమే.  రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ప్రకటన: జూలై, ఆగస్టులలో..
 
  జూనియర్ ఇంజనీర్స్ పరీక్ష
 
 సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఫరక్కా బ్యారేజ్ వంటి వాటిల్లో జూనియర్ ఇంజనీర్ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తుంది.
 అర్హత: సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచ్‌ల్లో డిగ్రీ(లేదా)మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు నిర్దేశించిన పని అనుభవం తప్పనిసరి.
 వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి  కొన్ని పోస్టులకు 18-27 ఏళ్లు. మరికొన్ని పోస్టులకు 32 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
 ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల  ఆధారంగా. రాత పరీక్ష 500 మార్కులకు, ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
 రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.  పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 వ్యాసరూప విధానంలో ఉంటాయి.
 
 పేపర్-1 పరీక్ష విధానం: ఇది ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌కు 50 మార్కులు; జనరల్ ఇంజనీరింగ్  పార్ట్-ఏలో సివిల్ లేదా స్ట్రక్చరల్, పార్ట్-బీలో ఎలక్ట్రికల్, పార్ట్- సీలో మెకానికల్ ఉంటాయి. ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవాలి. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
 
 పేపర్-2 పరీక్ష విధానం: ఇందులో జనరల్ ఇంజనీరింగ్‌లో భాగంగా.. పార్ట్-ఎలో సివిల్ అండ్ స్ట్రక్చరల్, పార్ట్-బిలో ఎలక్ట్రికల్, పార్ట్-సిలో మెకానికల్ ఉంటాయి. ఏదో ఒక విభాగాన్ని ఎంచుకొని వ్యాసరూప విధానంలో సమాధానాలు రాయాలి. మొత్తం మార్కులు 300. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
 ఇంటర్వ్యూ: రాతపరీక్ష ఉత్తీర్ణులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 100 మార్కులుంటాయి. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా, ప్రకటన: ఫిబ్రవరిలో, పరీక్ష తేదీ: మే 25, 2014
 
 కానిస్టేబుళ్ల భర్తీ


 కేంద్ర రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి ప్రతి ఏటా ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్‌లో
 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేస్తారు.
 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
 ఎంపిక: శారీరక ప్రమాణాలు, శారీరక సామర్థ్యం, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా.
 రాత పరీక్ష విధానం: శారీరక సామర్థ్య, ప్రమాణాల పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారిని రాత పరీక్షకు పిలుస్తారు. రెండు గంటల వ్యవధిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అవి.. పార్ట్-ఎ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, పార్ట్-సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్-డి ఇంగ్లిష్/హిందీ. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/హిందీ మినహా మిగతా మూడు పార్టులను మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగులో కూడా రాయొచ్చు.
 వైద్య పరీక్ష: రాత పరీక్ష ఉత్తీర్ణులకు వైద్య పరీక్షను నిర్వహిస్తారు.
 ప్రకటన: డిసెంబర్‌లో..
 
 మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) సిబ్బంది


 వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాలు మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తోంది.
 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
 వయోపరిమితి: నిర్దేశించిన తేదీ నాటికి 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
 ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. పేపర్-1లో సాధించిన మార్కుల ఆధారంగా పేపర్-2కు ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అయితే నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.  
 రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి.
 పరీక్ష వ్యవధి: రెండు గంటలు.
 పేపర్-1 పరీక్ష విధానం:
 విభాగం          పశ్నల సంఖ్య    మార్కులు
 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్    25    25
 న్యూమరికల్ ఆప్టిట్యూడ్    25    25
 జనరల్ ఇంగ్లిష్    50    50
 జనరల్ అవేర్‌నెస్     50    50
 పేపర్-2: షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లిష్ లేదా ఏదైనా భాషలో రాయాలి. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. 30 నిమిషాల వ్యవధిలో జరిగే పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. ప్రకటన: నవంబర్‌లో..
 
సబ్ ఇన్‌స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు


 ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్‌డ్‌ఫోర్సెస్‌లలో సబ్ ఇన్‌స్పెక్టర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
 
 మొత్తం పోస్టుల సంఖ్య: సబ్ ఇన్‌స్పెక్టర్స్-2197, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్స్- 564.
 అర్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఢిల్లీ పోలీస్ ఎస్‌ఐ పోస్టులకు పోటీపడేవారు డ్రైవింగ్ లెసైన్స్‌ను కలిగి ఉండాలి.
 వయోపరిమితి:
 నిర్దేశిత తేదీనాటికి 20-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
 ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
 రాత పరీక్ష విధానం:
 ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1, పేపర్-2. రెండు పేపర్లు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి.
 ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి: రెండు గంటలు.
 
 పేపర్-1:
 సబ్జెక్ట్      ప్రశ్నల సంఖ్య    మార్కులు
 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్        50        50
 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్     50        50
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్         50        50
 ఇంగ్లిష్ కాంప్రహెన్షన్         50        50
 పేపర్-2: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై 200 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. వ్యవధి రెండు గంటలు. శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు: పేపర్-1లో ఉత్తీర్ణత సాధించినవారిని శారీరక  సామర్థ్య, వైద్య పరీక్షలకు పిలుస్తారు. ఇందులో భాగంగా నిర్దేశించిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. దీంతోపాటు పరుగుపందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌ఫుట్ వంటివి నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినవారికి మాత్రమే పేపర్-2 నిర్వహిస్తారు.
 దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014
 పేపర్ -1 పరీక్ష తేదీ: జూన్ 22, 2014
 పేపర్-2 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014
 ---------------------------------------
 పై పోస్టులే కాకుండా.. ప్రసార భారతి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివాటిలోనూ వివిధ ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తోంది. సంబంధిత సంస్థల్లో ఖాళీల ఆధారంగా వీటికి ప్రకటనలు వెలువడుతుంటాయి. ఉద్యోగ నియామక ప్రకటనల కోసం www.ssc.nic.in, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్, www.sakshieducation.com వంటి వాటిని చూడొచ్చు.
 

మరిన్ని వార్తలు