ఐటీలో నీలమ్ విమన్ బ్రాండ్!

15 Dec, 2013 01:37 IST|Sakshi
ఐటీలో నీలమ్ విమన్ బ్రాండ్!

విజయం
 హెచ్‌సీఎల్ ఆఫీస్ వేళల్లో మినహాయిస్తే..
 ఓ సాధారణ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించే నీలమ్.. మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏదైనా సాధిస్తారంటారు.
 
 ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో అమ్మాయిలు లేని కంపెనీలు కనిపిస్తాయా..? అయినా ప్రస్తుతం దేశంలో సాఫ్ట్‌వేర్ రంగంలోని అమ్మాయిల సంఖ్య 20 శాతమే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. పాతికేళ్ల క్రితం సంగతి ఆలోచించండి! అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ అప్పట్లో ఐటీ గురించి తెలిసింది అంతంతమాత్రం! కానీ ఆ రోజుల్లోనే ఐటీలో అడుగుపెట్టిందో అమ్మాయి. అడుగు పెట్టడమే కాదు.. ఆ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి.. హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల్ని నడిపించింది. ఇప్పుడు హెచ్‌పీ సంస్థకు ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. భారత ఐటీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ముఖ్య పాత్ర పోషించిన ఆ మహిళా శక్తి నీలమ్ ధావన్! మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చే ఆమె గాథ తెలుసుకుందాం రండి!
 
 ఓ సంస్థలో కీలక బాధ్యత పోషిస్తున్న వ్యక్తి.. రాజీనామా చేసి మరో కంపెనీకి వెళ్తుంటే పాత కంపెనీకి చెందిన యాజమాన్యం ఆ వ్యక్తి గురించి సానుకూలంగా మాట్లాడటం అరుదు! కానీ ఐదేళ్ల క్రితం మెక్రోసాఫ్ట్ ఎండీ పదవికి రాజీనామా చేసినపుడు ఆ సంస్థ ఓ ప్రకటనలో.. ‘‘నీలమ్ సేవల్ని కోల్పోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. ఒక గొప్ప నాయకురాలు మాకు దూరమవుతోంది. మూడేళ్ల పదవీ కాలంలో ఆమె భారత్‌లో మైక్రోసాఫ్ట్ మూలాల్ని పటిష్టం చేశారు. ఆమె హెచ్‌పీ సంస్థను కూడా ఇలాగే నడిపించాలి’’ అని పేర్కొంది. ఈ ప్రకటనను బట్టే నీలమ్ ఎంతటి సమర్థురాలో అర్థం చేసుకోవచ్చు.
 
 భారత్‌లో ఐటీ రంగం గురించి అందరికీ తెలిసింది... ఆ రంగం అమోఘమైన వృద్ధి సాధించింది గత ఒకటిన్నర దశాబ్దంలోనే. ఐతే ఐటీ రంగంలో నీలమ్ అనుభవం పాతికేళ్లు. ఈ కాలంలో ఆమె ఎన్నో విజయాలు సాధించారు. ఐటీ రంగంలో ఎన్నో మార్పులకు సాక్షిగా నిలిచారు. ప్రధాన కంపెనీల ఎదుగుదలలో ఆమె పాత్ర కీలకం. ఢిల్లీకి చెందిన ఓ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నీలమ్.. సెయింట్‌స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. ఐటీ రంగం అంటే తెలియని రోజుల్లో.. అందులోనూ అమ్మాయిలు అసలే అటువైపు చూడని రోజుల్లో నీలమ్ హెచ్‌సీఎల్‌లో ఓ ఉద్యోగిగా చేరారు. ఆ సంస్థలో నీలమ్ ప్రస్థానం పద్నాలుగేళ్లు సాగింది. మార్కెటింగ్ విభాగంలో ఉన్నత స్థానానికి ఎదిగారు.
 
 దేశంలో సామాన్యులకు అందనంత స్థాయిలో ఉన్న పీసీల ధరలు దిగి రావడంలో నీలమ్‌ది కీలకపాత్ర. ధరలు తగ్గించడం ద్వారా అమ్మకాలు పెంచి లాభాల్లో కోత పడకుండా చూశారామె. హెచ్‌సీఎల్ పీసీలు ఈఎంఐల్లో అమ్మడం కూడా ఆమె నిర్ణయమే. హెచ్‌సీఎల్ తర్వాత నీలమ్ ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ లీవర్ సంస్థల్లో పని చేశారు. ఐతే ఈ సంస్థలు మార్కెటింగ్ విభాగాల్లో మహిళలకు కీలక బాధ్యతలు ఇవ్వడానికి నిరాకరించడంతో నీలమ్ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తర్వాత ఐబీఎం, కాంపాక్ సంస్థల్లో కీలక బాధ్యతల్లో పనిచేశారు. ఆపై మైక్రోసాఫ్ట్ వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు. 2005లో ఆమె మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ అయ్యారు. మూడేళ్ల కాలంలో ఆమె సంస్థను ఎంతో వృద్ధికి తీసుకెళ్లారు. 2008లో ఆమె హెవ్లెట్-ప్యాకర్డ్ (హెచ్‌పీ) సంస్థకు ఎండీ అయ్యారు. అప్పటి నుంచి ఆ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు.
 
 ఐటీ రంగంలో ఓ సాధారణ ఉద్యోగిగా చేరి, దిగ్గజ సంస్థల్ని నడిపించే స్థాయికి చేరిన నీలమ్.. ఈ ఘనతంతా తన కుటుంబానిదే అంటారు. తన తల్లిదండ్రులు అమ్మాయినన్న వివక్ష లేకుండా, తన అన్నతో సమానంగా చూడటం వల్లే తానీ స్థాయిలో ఉన్నానని.. తర్వాత తన భర్త, అత్త కూడా తనకు అండగా నిలిచారని చెబుతారామె. ఆఫీస్ వేళల్లో మినహాయిస్తే.. ఓ సాధారణ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించే నీలమ్.. మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏదైనా సాధిస్తారంటారు. ‘‘జీవితంలో మనకు మనం పరిమితులు పెట్టుకోకూడదు. ఏదో ఇబ్బంది ఎదురైందని అక్కడితో ప్రయత్నం మానకూడదు. మహిళలు ముందు వారిని వారు నమ్మాలి. కుటుంబ ప్రోత్సాహం కూడా తోడైతే మన ఎదుగుదలకు ఆకాశమే హద్దు’’ అంటారామె.
-  ప్రకాష్ చిమ్మల

మరిన్ని వార్తలు