సీట్లు అధికం...చేరికలు స్వల్పం

8 Jul, 2016 02:08 IST|Sakshi
సీట్లు అధికం...చేరికలు స్వల్పం

డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల తీరిది
* తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినా చేరని 58,280 మంది విద్యార్థులు
* రెండో దశలోనూ చేరింది తక్కువే
* రేపట్నుంచి 12 వరకు చివరిదశ వెబ్ ఆప్షన్లు
* 14న సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు గందరగోళంగా తయారయ్యాయి. లక్షల మందికి సీట్లు కేటాయించినా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంది.

కోర్టును ఆశ్రయించి ఆన్‌లైన్ ప్రవేశాల నుంచి మినహాయింపు పొందిన 13 కాలేజీల యాజ మాన్యాలు తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభిం చిన విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరించగా.. మరోవైపు సీటు లభించిన కాలేజీల్లో చేరేందుకు ఇష్టంలేక మరికొందరు విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదు. ఇంకొందరికి ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు లభించలేదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్నా భర్తీ అయిన సీట్లు తక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు చివరి దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారం భం కానుంది. ఇందుకోసం కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని, 18వ తేదీలోగా వారంతా కాలేజీల్లో చేరాలని స్పష్టం చేసింది. తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులను ఈ నెల 4 నుంచి ప్రారంభించింది.
 
1.47 లక్షలకు చేరింది 89,327 మందే..
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా 3,97,430 సీట్ల భర్తీకి కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలి దశ ప్రవేశాల్లో భాగంగా కాలేజీల్లో చేరేందుకు 1,74,744 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.  అందులో 1,71,900 మందే గత నెలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలోనూ 1,47,607 మందికి  సీట్లు కేటాయించగా 1,28,453 మందే అలాట్‌మెంట్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారిలో 89,327 మందే కాలేజీల్లో చేరారు. అంటే సీట్లు పొందిన విద్యార్థుల్లో 58,280 మంది కాలేజీల్లోనే చేరలేదు. ఇక గత నెల 29 నుంచి ఈ నెల 1 వరకు చేపట్టిన రెండోదశ కౌన్సెలింగ్‌లో 68,337 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా (ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, గతంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు) 65,726 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులోనూ సీట్లు లభించిన వారిలో అధికశాతం విద్యార్థులు చేరలేదు.

మరిన్ని వార్తలు