హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ చార్మికి ఊరటేమీ లభించలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లారని, తాము ఆమెను నిందితురాలు అనలేదన్నాయి.నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతోందని, పూర్తి ఆధారాలతోనే విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. విచారణ సమయంలో కొందరు పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల పేర్లు చెబుతున్నారని, డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమ రెండుగా విడిపోయిందని వ్యాఖ్యానించాయి.
విచారణకు వచ్చేవారు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారని, ఆనవాళ్లు దొరక్కుండా జ్యూస్లు తాగే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశాయి. వెంట్రుకల్లో ఆధారాలు లభించకుండా హైలీ కాస్మోటిక్ షాంపూలతో తలస్నానం చేసి విచారణకు వస్తున్నారని వెల్లడించాయి. సిట్ విచారణ పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతోందని తెలిపాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటోందని పేర్కొన్నాయి. డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చాక డీఅడిక్షన్ సెంటర్లకు తాకిడి పెరిగిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి.