జెన్‌కో ప్రాజెక్టుల్లో అవినీతి లేదు

12 Mar, 2016 03:17 IST|Sakshi

ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం స్టేజ్-2, ఎన్టీటీపీఎస్ స్టేజ్-5 థర్మల్ ప్రాజెక్టుల బీవోపీ కాంట్రాక్టుల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్ వివరణ ఇచ్చారు. ఇంత వరకూ టెండర్లను ఖరారు చేయలేదని, ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాక్షిలో వచ్చిన ‘జెన్‌కో థర్మల్ ప్రాజెక్టుల్లో 2,880 కోట్ల రూపాయలు’ అనే వార్తపై ఆయన స్పందించారు. కాంట్రాక్టుల ధరలను ప్రముఖ కన్సల్టెన్సీలు పరిశీలించాయని, బిడ్డర్లతో జరిగిన చర్చల్లోనూ వారు పాల్గొన్నారని ఆయన తెలిపారు. బీజీఆర్, టాటా సంస్థలు ఎల్-1గా నిలిచినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో బీవోపీ కాంట్రాక్టుల్లో ధరలను పరిశీలిస్తున్నామని, దీనికోసం మరో కన్సల్టెన్సీకి కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

 కొరత కారణంగా కొన్నాం: ట్రాన్స్‌కో డెరైక్టర్
 రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని, ఈ కారణంగానే విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ట్రాన్స్‌కో డెరైక్టర్ దినేష్ పరుచూరి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు. అయితే, స్వల్పకాలిక కొనుగోళ్ళను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఇక సోలార్ టెండర్లలో రూ. 755 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై సోలార్ కార్పొరేషన్ ఎండీ ఆదిశేషు వివరణ ఇస్తూ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో సోలార్ ఇపీసీ కాంట్రాక్టులు మెగావాట్‌కు రూ. 5.6 కోట్లకు ఇచ్చినా, అక్కడ ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ 18 శాతమేనని, ఏపీ జెన్‌కో మాత్రం 21 శాతం పీఎల్‌ఎఫ్ గ్యారంటీ కోరిందని వివరించారు. అదే మాదిరి పీఎల్‌ఎఫ్‌తో పోలిస్తే, జెన్‌కో కాంట్రాక్టులు మెగావాట్‌కు రూ. 5.36 కోట్లకే వచ్చినట్టన్నారు. విదేశీ బొగ్గు మింగేశారు... అంటూ వచ్చిన వార్త కథనంపై జెన్‌కో సీఈ కృపాసాగర్ మాట్లాడుతూ.. 2014లో మహానది కోల్ ఫీల్డ్స్ బొగ్గు సరఫరా కేవలం 67 శాతమే ఉందని, దీంతో థర్మల్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత ఏర్పడిందని, ఈ కారణంగానే కాంట్రాక్టు ముగిసినా, ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నుంచి బొగ్గు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు