రామగుండంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ!

12 Mar, 2016 03:17 IST|Sakshi

వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదనకు సీఎం గ్రీన్‌సిగ్నల్
 సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రతీ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీయిచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ఈ ఏడాది మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని కేటాయించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాత్రం లేదు.

రామగుండంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాట్లు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కాలేజీ ఏర్పాటుకు సింగరేణి, ఎన్టీపీసీలు నిధులు అందజేస్తే కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటామని రాష్ర్ట ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో నిధులు ఇవ్వడానికి ఆ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ రామగుండం ఎన్టీపీసీకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు సంబంధిత ప్రతిపాదన ఫైలును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపితే ప్రధాని సమక్షంలో హామీ తీసుకోవచ్చని స్థానిక ప్రజాప్రతినిధులు సీఎంకు చెప్పినట్లు తెలిసింది.  అవసరమైతే సింగరేణి ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు