భార్య అలా ప్రవర్తించడం చూడలేక...

23 Mar, 2016 19:19 IST|Sakshi
భార్య అలా ప్రవర్తించడం చూడలేక...

ఇబ్రహీంపట్నం రూరల్: భార్య ప్రవర్తన బాగలేదని మనోవేదనకు గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధన్‌లాల్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్లకు చెందిన ఆరెండ్ల కృష్ణారెడ్డి(35), స్రవంతి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు సరూర్‌నగర్ మండలం మీర్‌పేట్‌లోని ప్రశాంత్‌హిల్స్‌లో ఉంటున్నారు. కృష్ణారెడ్డి ఓ బీమా కంపెనీలో ఏజెంట్. స్రవంతి సోమాజిగూడలో ఉన్న ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కట్నం కూడా కొంత రావాల్సి ఉందని కృష్ణారెడ్డి భార్యతో తగువులాడుతుండేవాడు. రెండు నెలల క్రితం స్రవంతి చెల్లెలు భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె వీరి వద్దే ఉంటుంది.

ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, స్రవంతి తన కంపెనీలోని తోటి ఉద్యోగులతో తరచూ ఫోన్‌లో మాట్లాడటం కృష్ణారెడ్డికి నచ్చకపోయేది. ఈ నేపథ్యంలో అతడు గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణారెడ్డి గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట ఉన్న ఓ చెట్టు ఎక్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కిందికి దించి పరిశీలించగా అతడి ప్యాంట్ జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. దాని ద్వారా పైవివరాలు తెలిశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణారెడ్డి, భార్య, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు