నెల్లూరులో చిక్కిన హైదరాబాదీలు
పట్టుబడిన నలుగురిలో ఒకరైన రవూఫ్పై ఇప్పటికే పలుకేసులు
కేసు ఆదాయపుపన్ను శాఖకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఓ స్థలానికి సంబంధించి జీపీఏ చేసుకోవడానికి నెల్లూరు వెళ్లిన నలుగురు హైదరాబాదీలను అక్కడి పోలీసులు గురువారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.54 కోట్ల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తం దొరకడంతో కేసును ఆదాయపుపన్ను శాఖకు అప్పగించారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి నగరంలోని కోకాపేట ప్రాంతంలో ఏడెకరాల భూమి ఉంది. దీన్ని ఖరీదు చేయడానికి సిద్ధమైన ఐదుగురు సిటీ రియల్టర్లు నాలుగు నెలల క్రితం కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. యజమాని నుంచి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేయించుకునే నిమిత్తం హైదరాబాద్ నుంచి వెళ్లిన నలుగురు రియల్టర్లు నెల్లూరులోని మినర్వా హోటల్లో బస చేశారు.
ఈ నేపథ్యంలోనే... సదరు హోటల్లో భారీ మొత్తం నోట్ల మార్పిడి జరుగుతోందంటూ అక్కడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు గురువారం సాయంత్రం ఆ హోటల్పై దాడి చేసి రియల్టర్లు బస చేసిన గదిలో తనిఖీలు చేశారు. అక్కడ రూ.1,54,48,000 విలువైన కొత్త రూ.2 వేల నోట్లతో పాటు మరో రూ.39 లక్షలకు చెందిన డిమాండ్ డ్రాఫ్ట్లు దొరికాయి. కోకాపేటలోని స్థలానికి చెందిన అగ్రిమెంట్లు, ఇతర పత్రాలు సైతం వీరివద్ద లభించాయి. ఇంత భారీ మొత్తంలో కొత్త నోట్లు ఎక్కడ నుంచి వచ్చాయనే అంశాన్ని పోలీసులు రియల్టర్లను ప్రశ్నించారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నగదుతో పాటు నలుగురినీ ఆదాయపుపన్ను శాఖకు అప్పగించారు.
వీరు వినియోగించిన వాహనంపై తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. రియల్టర్లు ఎంఏ రవూఫ్, ఎం.శ్రీపాల్రెడ్డి, బి.శ్రావణ్కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాలేద్గా గుర్తించారు. వారిలో రవూఫ్ సైదాబాద్కు చెందిన వారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దానికి ప్రతీకారంగా నగరంలో చోటు చేసుకున్న మాణిక్ ప్రభు మెడికల్ హాల్ యజమాని హత్య, 2003 మార్చి 26న జరిగిన గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్పాండ్య హత్య, గుజరాత్ కుట్ర కేసుల్లో అరెస్టు అయ్యాడు. ఆయనపై న్యాయస్థానంలో ఈ కేసులన్నీ వీగిపోయాయి. సుదీర్ఘకాలం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉండి వచ్చిన రవూఫ్ ఆపై సైదాబాద్లో ఓ కార్యాలయాన్ని స్థాపించి రియల్టర్గా మారాడు. 2011లో అఫ్జల్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్సియర్ను బెదిరించిన ఆరోపణలపై స్థానిక ఠాణాలో మరో కేసు సైతం నమోదైంది.