దేవిది ముమ్మాటికీ హత్యే...:నిరంజన్ రెడ్డి

5 May, 2016 13:51 IST|Sakshi
దేవిది ముమ్మాటికీ హత్యే...:నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : తన కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కూతురిని హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన గురువారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి పార్టీ ఉందని చెబితే దేవిని పంపించానని, ఉదయం 3.20 గంటలకు ఫోన్ చేస్తే రెండు నిమిషాల్లో వస్తానని చెప్పిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎక్కడో చంపి కారు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించారన్నారు.  (కారులో నుంచి అరుపులు వినిపించాయి)

తర్వాత తన కూతురు ఫోన్ నుంచి మిస్డ్ కాల్ వచ్చిందని, కొద్దిసేపటి తర్వాత పోలీసులు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారన్నారు. తన కూతురు మరణం వెనుక బడా బాబుల పిల్లలు ఉన్నారన్నారు. దేవి బయటకు వెళితే తాను ప్రతి నిముషం ఆమెతో ఫోన్ లో టచ్ లోనే ఉంటానని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన గంట వరకూ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఈ  గంటలోనే కేసు మొత్తాన్ని తారు మారు చేశారని ఆయన ఆరోపించారు.

ప్రత్యక్ష సాక్షి ప్రకారం దేవిని బలవంతంగా కారులో లాక్కెళ్లారని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న దేవి స్నేహితుడు సామ భరత్ సింహారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు