‘గ్రేటర్’లో టీడీపీ ఖేల్ ఖతం

1 Jun, 2016 06:25 IST|Sakshi
‘గ్రేటర్’లో టీడీపీ ఖేల్ ఖతం

నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీ ఖేల్ ఖతం అవుతోంది. పార్టీకి తెలంగాణలో మిగిలిన ఏకైక ఎంపీ, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చామకూర మల్లారెడ్డి బుధవారం అధికార టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ను కలుస్తారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి ఎంపీ స్థానంతో పాటు ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కంటోన్మెంట్, జూబ్లిహిల్స్, సనత్‌నగర్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నెగ్గారు. వీరిలో ఒక్క ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మినహా మిగిలిన వారంతా ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కృష్ణయ్య సైతం సొంత కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. నగరంలో పార్టీకి పెద్ద దిక్కుగా మిగిలిన ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోతుండటంతో టీడీపీ ఉనికి నామమాత్రంగానే మిగిలిపోనుంది.

 సొంత ప్రజలకు దగ్గరగా ఉండాలనే: మల్లారెడ్డి
సొంత రాష్ట్రంలో సొంత ప్రజలకు మరింతగా దగ్గరగా ఉండాలనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. బుధవారం ముఖ్యమంత్రిని కలుస్తా. ప్రజల అభీష్టం మేరకు పనిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.

మరిన్ని వార్తలు