రిపోర్టర్‌వా..? పులివెందుల గూండావా..?

20 Mar, 2016 02:09 IST|Sakshi
రిపోర్టర్‌వా..? పులివెందుల గూండావా..?

‘సాక్షి’ ప్రతినిధిపై టీడీపీ ఎమ్మెల్యేల దురుసు ప్రవర్తన
 
 సాక్షి, హైదరాబాద్: రోజా వ్యవహారంలో అప్రతిష్టపాలైన అధికారపార్టీ ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి, ‘సాక్షి’ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. అడ్డూ అదుపూ లేకుండా దుర్భాషలాడారు. తాము చెప్పిందే రాసుకోవాలని హుంకరించారు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే ఊరుకునేది లేదని, హద్దుల్లో ఉండాలంటూ బెదిరించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు శనివారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, అనంతర పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ అనేక మందిని రోజా తరహాలోనే సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో ‘అక్కడ కోర్టులు ఈ తీర్పులను కొట్టివేశాయి.

ఆ తర్వాత సభ్యులను సభలోకి అనుమతించారు కదా’ అని సాక్షి ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బోండా ఉమామహేశ్వరరావు ఒక్కసారిగా మాటల దాడి మొదలు పెట్టారు. ‘నువ్వు పులివెందుల గూండా లా మాట్లాడుతున్నావ్.. రిపోర్టర్‌లా లేవు. మేం మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే మాత్రం.. పద్ధతులు మార్చుకోండి’ అంటూ పళ్లు బిగించారు. ఇదే అదునుగా బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయారు. ‘ఏం దౌర్జన్యం చేస్తున్నావా? నిన్న కూడా మమ్మల్ని ప్రశ్నలు అడిగావ్.. నువ్వు కేవలం రిపోర్టు మాత్రమే చెయ్యి. డోంట్ ఆర్గ్యూ. కూర్చో.. ఏం చేస్తావ్.. నీ హద్దుల్లో నువ్వుండు.. బీ కేర్ ఫుల్’ అంటూ వేలు చూపిస్తూ బెదిరించారు. ఇదే సందర్భంలో ఆయన అదుపు తప్పి ‘రేయ్..’ అన్నారు. అరగంట సేపు సాక్షి ప్రతినిధితో వాగ్వాదానికి దిగారు.

మరిన్ని వార్తలు