నిర్మాత కార్యాలయంలో నగదు, ఇన్నోవా చోరీ

4 Nov, 2016 18:54 IST|Sakshi

హైదరాబాద్: ఓ సినీ నిర్మాత కార్యాలయంలో నగదుతో పాటు ఓ ఇన్నోవా  వాహనం చోరీకి గురయింది. బంజారాహిల్స్‌పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ... ఫిలింనగర్ రోడ్ నంబర్ -11లో సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్‌కు చెందిన సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ సినీ కార్యాలయం ఉంది.  డ్రైవర్‌ సురేష్తోపాటు శ్రీకాకుళంకు చెందిన ప్రసాద్, గుంటూరుకు చెందిన ప్రసాద్‌ నాయుడు అటెండర్లుగా ఏడాది కాలంగా పని చేస్తున్నారు. కాగా నిర్మాత శివకుమార్ గురువారం పని నిమిత్తం చెన్నైకి వెళ్లగా సురేష్‌తో పాటు ఆఫీస్ బాయ్‌లు ఇద్దరూ కార్యాలయంలో పడుకున్నారు.

శుక్రవారం ఉదయం ఆఫీస్ మేనేజర్ రవీందర్ కార్యాలయానికి వెళ్లేసరికి లాకర్ తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. అందులో ఉండాల్సిన రూ.20 వేల నగదుతో పాటు బయట ఉన్న ఇన్నోవా కారు కనిపించలేదు. వీరి కోసం ప్రయత్నించగా సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. దీంతో రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆఫీస్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా డ్రైవర్తో పాటు ఆఫీస్ బాయ్లు చోరీకి పాల్పడిన దృశ్యాలు నమోదు అయ్యాయి. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు