హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. వెంటనే వెనుక నుంచి వచ్చిన బస్సు బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మెడిపల్లి పోలీస్ స్టేసన్ పరిధిలోని ఫిర్జౌదిగూడ కమాన్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా కేశవపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన మిత్రుడితో కలిసి నగరానికి ద్విచక్రవాహనం పై వస్తుండగా ఫిర్జౌదిగూడ వద్దకు చేరుకోగానే వేగంగా వస్తున్న బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న శ్రీనివాస్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అతని తలపై నుంచి బస్సు వెళ్లడంతో అతను చనిపోయాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.