పార్లమెంటుకు కోవిడ్‌ దెబ్బ 

25 Feb, 2020 10:44 IST|Sakshi

చైనా పార్లమెంటు సమావేశాలు వాయిదా 

 2,592కు పెరిగిన కోవిడ్‌ మృతులు 

బీజింగ్‌: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో పార్లమెంటు వార్షిక సమావేశాలను వాయిదా వేసేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు చైనాలో ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులు పర్యటించారు. వ్యాధి ప్రాబల్యం ఉన్న పలు ఆస్పత్రుల్లో వీరు పర్యటించారు. కోవిడ్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆదివారానికి 2,592కు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 79 వేలు.. 
తాజా లెక్కల ప్రకారం చైనాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 77,150 కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 79,000గా ఉంది. వేర్వేరు ఆసుపత్రుల నుంచి ఆదివారం సుమారు 1846 మంది పూర్తి ఆరోగ్యవంతులై విడుదలయ్యారని ఆరోగ్య కమిషన్‌ తెలిపింది.  

ముప్పు తొలగి పోలేదు
కోవిడ్‌–19 ముప్పు ఇప్పటికీ తొలగిపోలేదని దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. కోవిడ్‌కు సంబంధించి ఆదివారం ఏడుగురు పొలిట్‌బ్యూరో సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు వ్యాధి నియంత్రణకు సంబంధించి శాయశక్తులా ప్రయ త్నించాలని కోరారు. చైనా అభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు