ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

21 Sep, 2019 05:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కొరడా ఝుళిపించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ఇరాన్‌ సెంట్రల్‌ బ్యాంకుపై శుక్రవారం సరికొత్త ఆంక్షలను విధించారు.  ‘మేం ఇరాన్‌ నేషనల్‌ బ్యాంకుపై సరికొత్త ఆంక్షలు విధించాం. ఓ దేశంపై విధించిన ఆంక్షల్లో ఇదే అత్యధికం. ఈ ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అంటూ ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసు వద్ద మీడియాతో అన్నారు. దీనితో పాటు ఇరాన్‌ సార్వభౌమ సంక్షేమ నిధిపై కూడా ఆంక్షలు విధించారు.

ఈ బోర్డులో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రోహని కూడా ట్రస్టీగా ఉన్నారు.  సౌదీ ఆరేబియా చమురు కర్మాగారాలపై ఇటీవల డ్రోన్‌ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులు ఇరానే చేసిందంటూ అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలను మరింత పెంచుతామని కూడా హెచ్చిరించారు. బలగాల పోరుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్‌ హెచ్చరించారు. అయితే శాంతియుత మార్గమే తమ ప్రాధాన్యమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో గురువారం తెలిపారు. అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని తెలిపింది.  

మరిన్ని వార్తలు