‘అణుక్షిపణి వస్తోంది.. ప్రాణాలు కాపాడుకోండి’

14 Jan, 2018 12:17 IST|Sakshi

హవాయి : సమాచారం చాలా విలువైనది. దానిని చాలా విలువైనదిగా చూడాలే తప్ప ఏ సమయంలో కూడా నిర్లక్ష్యం వహించకూడది. అలా చేస్తే ఒక్కోసారి ప్రాణనష్టం జరగొచ్చు, ఆస్తినష్టం జరగొచ్చు.. ఇంకా దారుణమైన పరిణామాలు ఎదుర్కోవచ్చు. అందుకే సమాచారం ఇచ్చే సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హవాయిలో ప్రజలను అప్రమత్తం చేసే అధికారుల్లో ఒకరు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ప్రజలంతా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. హవాయిపైకి ఏక్షణంలోనైనా క్షిపణి దూసుకురావొచ్చని, దీన్ని డ్రిల్‌ అనుకొని తేలిగ్గా తీసి పారేయకూడదని, అంతా అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశం సారాంశం. దాదాపు అన్ని మొబైల్‌ఫోన్‌లకు ఆ సందేశం పోయింది. దాంతో వెనుకాముందు ఆలోచించకుండా జనాలు తమ బంధువులకు ఫోన్‌లు చేసుకున్నారు.

అందరినీ అప్రమత్తం చేసుకొని వీలయిన చోట్లల్లో దాచుకొని ఎప్పుడు క్షిపణి పడుతుందోనని భయంతో బెంబేలెత్తిపోయారు. ’బాలిస్టిక్‌ అణు క్షిపణి హవాయి మీదకు దూసుకొస్తుంది’అంటూ ఉదయం 8.07గంటల ప్రాంతంలో అలర్ట్‌ వచ్చింది. దీంతో అంతా అప్రమత్తమయ్యారు. అడమ్‌ కుర్జ్‌ అనే వ్యక్తి తన అనుభవాన్ని చెబుతూ ‘నేను మిసైల్‌ అలర్ట్‌ వచ్చిన నాలుగు నిమిషాల తర్వాత నిద్ర లేచాను. అంతా పరుగులు పెడుతున్నారు. మాకు ఏం చేయాలో తోచలేదు. మా సాధు జంతువులను తీసుకొని వెంటనే వెళ్లి బాత్‌ రూంలో భద్రంగా ఉండొచ్చిని దాక్కున్నాము’  అని చెప్పారు. అయితే, డేవిడ్‌ ఐజ్‌ డీ అనే ప్రభుత్వ అధికారి ఈ సమాచారం తప్పని ధ్రువీకరించారు. ఎమర్జెన్సీ విభాగంలో పనిచేస్తున్న అధికారులు తమ షిప్ట్‌ మారే సమయంలో పొరపాటున రాంగ్‌ బటన్‌ నొక్కడంతో అందరికీ తప్పుడు సమాచారం వెళ్లినట్లు తెలిపారు. మున్ముందు అలాంటివి జరగకుండా చూసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు