ఆమెను తీసుకొచ్చే విమానమే దొరకలేదు

8 Dec, 2016 14:54 IST|Sakshi
ఆమెను తీసుకొచ్చే విమానమే దొరకలేదు

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలపాటు మంచానికే పరిమితమై ఎట్టకేలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ జోక్యంతో వైద్యం చేయించుకునే అవకాశం దక్కినప్పటికీ ఈజిప్టుకు చెందిన ఎమాన్‌ అహ్మద్‌ (36)ను మరో సమస్య వెంటాడుతోంది. దాదాపు అరటన్నుతో ప్రపంచంలోనే అధిక బరువున్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఎమాన్‌ను ఈజిప్టు నుంచి ఎలా ముంబయికి తీసుకురావాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏ విమానం ఆమె ప్రయాణికి అనుమతిస్తుందనేది పెద్ద సమస్యగా మారింది.

ఏ చార్టర్‌ విమానం కూడా ఆమెను తరలించేందుకు ఒప్పుకోవడం లేదు.. ముందుకు రావడం లేదు. ప్రస్తుతం కైరోలోని తన ఇంట్లోనే 25 ఏళ్లుగా ఉంటున్న ఆమె కనీసం ఒక్క అడుగుకూడా బయటకు వేయలేని పరిస్థితి. ముంబయికి చెందిన వైద్యులు ఆమెకు చికిత్స చేసేందుకు అంగీకరించడంతో తనకు జీవితంపై కొండంత ఆశ కలిగింది. అయితే, మొన్నటి వరకు వీసా దొరకలేదు. చివరకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉదారతతో ఆ సమస్య తీరింది. కానీ, ఇప్పుడు ఆమెను తీసుకోచ్చే విషయంలో మాత్రం ఏం చేయాలని ఆ కుటుంబ సభ్యులు మదనపడుతున్నారు.  ఈజిప్టు నుంచి ముంబయికి నేరుగా విమానాలు లేవు. అలాగే చార్టర్‌ విమానాలు కూడా అందుబాటులో లేవు.

ఒక వేళ ఆమెను తరలించాలని నిర్ణయించినా ఆ విమానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. జెట్‌ ఎయిర్‌ వేస్ నిబంధనల ప్రకారం 136 కేజీల లోపు బరువున్న రోగులను మాత్రమే స్ట్రెచర్‌ ద్వారా అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ బరువును అనుమతించరు. అయితే, ఏయిర్‌ ఇండియాకు మాత్రం అలాంటి సమస్య లేదు. అయితే, ముంబయి నుంచి ఆఫ్రికాకు నేరుగా విమాన సర్వీసు లేదని, జర్నీలోని ఫ్రాంక్‌ ఫర్డ్‌ వరకు అవకాశం ఉందని, వారి విజ్ఞప్తిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్విని లోహానీ తెలిపారు. ఈమెకు సర్జరీ చేసి బరువు తగ్గించడాన్ని ముంబయి వైద్యులు చాలెంజ్‌గా తీసుకున్నారు.

మరిన్ని వార్తలు