భారత్‌కు మరోసారి షాకిచ్చిన మాల్దీవులు

7 Jul, 2018 18:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లాహోర్‌ : పాకిస్తాన్‌తో సరికొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుని మాల్దీవులు భారత్‌కు మరోసారి షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే చైనాతో బంధాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పిన మాల్దీవులు.. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించి పాక్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. జల వనరులు, విద్యుత్‌ అభివృద్ధి(డబ్ల్యూఏపీడీఏ) సంస్థ కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు మాల్దీవ్స్‌ స్టేట్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ బృందం ఆరు రోజుల పాటు పంజాబ్‌ ప్రావిన్స్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా డబ్ల్యూఏపీడీఏ చైర్మన్‌ ముజామిల్‌ హుస్సేన్‌తో సమావేశమైన అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మాల్దీవుల ప్రతినిధి అహ్మద్‌ అమన్‌ తెలిపారు. పవర్‌ సెక్టార్‌ విభాగంలో పాక్‌తో ఎంఓయూ కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అహ్మద్‌ వ్యాఖ్యానించారు. ఎంఓయూలో భాగంగా డబ్ల్యూఏపీడీఏ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, సిబ్బంది మార్పిడి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం వంటి పలు అంశాల్లో దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.

కాగా మిత్రబంధానికి నిదర్శనంగా భారత్‌ ఇచ్చిన ధ్రువ హెలికాప్టర్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాల్దీవులు కోరిన విషయం తెలిసిందే. సముద్ర తలంపై నిఘా, తప్పిపోయిన నౌకలను వెతికేందుకు హెలికాప్టర్లను అందించే ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో మాల్దీవులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో కూడా భారత్‌ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన మాల్దీవులు.. భారత్‌ దాయాది పాక్‌తో ఒప్పందాలు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు