-

చైనా యాప్‌ల బ్యాన్‌ దిశగా అమెరికా?

7 Jul, 2020 14:23 IST|Sakshi

వాషింగ్టన్‌: గల్వాన్‌ వ్యాలీ ఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌ నిర్ణయానికి అమెరికా మద్దతు తెలిపి‍ంది. అంతేకాక ప్రస్తుతం తాము కూడా చైనా యాప్‌లను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడి కంటే ముందు బయటపడాలని అనుకోవడం లేదు. కానీ చైనా యాప్‌లను బహిష్కరించాలని భావిస్తున్న మాట మాత్రం వాస్తవం. అధ్యక్షుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం’ అన్నారు. అమెరికా చట్టసభ సభ్యులు కూడా టిక్‌టాక్‌ యాప్‌ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక టిక్‌టాక్ అమెరికా యూజర్ల డాటాను నిర్వహించడంపై కూడా అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.(‘బ్యాన్‌ టిక్‌టాక్’‌ అమెరికాలోనూ..!)

చైనాలో అందుబాటులో లేని టిక్‌టాక్‌ యాప్‌ను‌ ప్రపంచ నలుమూలలా జనాలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని దేశాలు చైనాయాప్‌లను బహిష్కరించాలని పాంపియో కోరారు. చైనా వంచన విధానంతోనే కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాక హాంగ్‌కాంగ్‌ వ్యవహారంలోనూ చైనా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా ఇప్పుడు చైనా యాప్‌ల నిషేధం దిశగా అడుగులు వేయడం గమనార్హం. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు)

మరిన్ని వార్తలు