ఇలా చేస్తే రైలు టిక్కెట్‌ ఫ్రీ

5 Jul, 2019 17:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రష్యా ప్రభుత్వం క్రీడారంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు కూడా ఫిట్‌నెస్‌ అనేది పెద్ద సమస్యగా మారింది. అనేక మంది ఊబకాయంతో బాధ పడుతున్నారు. అలాంటి వారిని వ్యాయామం వైపు ప్రోత్సహించేందుకు రష్యా రాజధాని మాస్కో నగరంలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్‌ ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే ఆ యంత్రం నుంచే ఉచితంగా మెట్రోలో ప్రయాణించేందుకు టిక్కెట్‌ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు తీయలేదా 30 రూబుల్స్‌ను చెల్లించాల్సిందే. 30 రూబుల్స్‌ డాలర్‌ కన్నా కొంచెం తక్కువే అయినప్పటికీ రష్యా ప్రజలకు అవి చాలా ఎక్కువ.

2014 వింటర్‌ ఓలిపింక్స్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన రావడంతో 2013లోనే మెట్రో స్టేషన్‌లో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. యంత్రం ముందు గుంజీలంటే మనలాగా చెవులు పట్టుకొని తీయాల్సిన అవసరం లేదు. రెండు చేతులు ముందుకు చాపి, మొకాళ్లను వంచి, కూర్చొని లేస్తే చాలు. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియా యుగంలో బాగా పాపులర్‌ అయింది. దాంతో ఓ మెక్సికో నగరంలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్‌ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విజయం సాధించింది. అక్కడ రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీయకపోతే పెద్దగా వచ్చే నష్టమేమి లేదు. ఎందుకంటే అక్కడ మెట్రో రైలు టిక్కెట్‌ వారి కరెన్సీలో పది రూపాయలతో సమానం.

మరిన్ని వార్తలు