నేపాల్‌– భారత్‌  మధ్య కొత్త చెక్‌పోస్ట్‌ 

22 Jan, 2020 02:12 IST|Sakshi

సంయుక్తంగా ప్రారంభించిన ఇరుదేశాల ప్రధానులు 

కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌– నేపాల్‌ సరిహద్దుల్లో భారత్‌ సాయంతో నేపాల్‌ నిర్మించిన ‘జోగ్‌బని–బిరాట్‌నగర్‌’ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ను వీడియో లింక్‌ ద్వారా మంగళవారం ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ చెక్‌పోస్ట్‌ నిర్మాణం కోసం భారత్‌ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది. ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్‌పోస్ట్‌ను రూపొందించారు.

260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్నేహపూర్వక పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. ఆ దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, విద్యావిషయక సంబంధాలు మెరుగుపడే దిశగా భారత్‌ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తుందన్నారు. భారత ప్రధానికి నేపాల్‌ పీఎం కేపీ శర్మ ఓలి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.  

మరిన్ని వార్తలు