పాక్‌లోనే మసూద్‌ అజార్‌

2 Mar, 2019 03:00 IST|Sakshi

అంగీకరించిన పాక్‌ మంత్రి

ఇస్లామాబాద్‌: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ పాక్‌లోనే ఉన్నాడని పాక్‌ విదేశాంగ మంత్రి మహమూద్‌ ఖురేషి అంగీకరించారు. అజార్‌ ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. అజార్‌కు సంబంధించి పాకిస్తాన్‌ కోర్టుల్లో గట్టి సాక్ష్యాలను భారత్‌ సమర్పిస్తే అతనిపై తమ ప్రభుత్వం∙చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ చేపట్టడానికి తగిన ఆధారాలు ఉండాలన్నారు.

పుల్వామా ఉగ్రదాడి, భారత్‌ సర్జికల్‌ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో మసూద్‌ తమ దేశంలోనే ఉన్నాడని పాక్‌ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతిపాదించిన విషయం తెల్సిందే. పుల్వామా దాడుల్లో జైషే పాత్ర, పాక్‌లో జైషే ఉగ్ర శిబిరాల వివరాలపై పాక్‌కు భారత్‌ అనేక సాక్ష్యాలను ఇప్పటికే అందించింది. కాగా, పైలట్‌ అభినందన్‌ను భారత్‌కు అప్పగించడం శాంతి ప్రక్రియలో భాగమని ఖురేషి తెలిపారు.

మరిన్ని వార్తలు