మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి

29 Mar, 2019 03:56 IST|Sakshi

నేరుగా ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టిన అమెరికా

ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్‌లు మద్దతు తెలిపాయి. చాలా శక్తిమంతమైన భద్రతామండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ స్పందించారు. ‘బలవంతంగా తీర్మానాన్ని ముందుకు జరపడం ఆపాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నాం’ అని అన్నారు.

ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్‌ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. 15 మంది (10+5) సభ్యులున్న భద్రతామండలిలో తీర్మానం పాస్‌ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అయితే శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయొద్దు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే చైనా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని అడ్డుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్‌ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది.

మరిన్ని వార్తలు