ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్..!!

7 Oct, 2016 23:00 IST|Sakshi
ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్..!!

కాలం ముందుకు వెళ్తోంది.. కానీ, కాలు ముందడుగు వేయనివ్వడం లేదు.. మనసులో ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి.. మనిషి మాత్రం మంచం మీద నుంచి కిందకి దిగే పరిస్థితి లేదు.. క్లుప్తంగా యువ హీరో వరుణ్ తేజ్ కండిషన్ ఇది. ఊటీలో ‘మిస్టర్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు వరుణ్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. గాయంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వరుణ్ తేజ్‌ను చూస్తే, వెంటనే ‘ఊపిరి’ పోస్టర్ గుర్తు రాక మానదు. వీల్ చైర్‌లో నాగార్జునలా వరుణ్, ఆ చైర్ వెనుకనే తమన్నాలా ‘మిస్టర్’ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, కార్తీలా నటుడు ‘సత్యం’ రాజేశ్‌లు ఈ నెల 1న ఫ్లైట్ దిగారు.

‘ఊపిరి’లో ముగ్గుర్నీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామంటూ వరుణ్ తేజ్ సరదాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇంటికొచ్చి వారమైంది. ఇంకా గాయం నయం కాలేదు. దాంతో ఎటూ వెళ్లడం కుదరడం లేదు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేలో వరుణ్ ఏం చేస్తున్నారో తెలుసా? టైమ్‌పాస్ కోసం బ్యాట్‌మాన్ బొమ్మలు గీశారు. మొబైల్‌లో ఫొటోలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి చిన్ని చిన్ని టైమ్‌పాస్‌లతో రోజంతా గడవడం కష్టమే. ‘‘ఇంట్లోనే ఉండడంతో బోర్ కొడుతోంది.. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్’’ అని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలోని ప్రేక్షకులకు విన్నవించుకున్నారు. గాయం తగ్గేవరకూ వరుణ్‌కి ఈ బోర్ తప్పదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. గాయం కారణంగా రెండు సినిమాల షూటింగ్‌లకూ తాత్కాలికంగా బ్రేక్ పడింది.

>