నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు

22 Mar, 2020 07:36 IST|Sakshi

నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని నటి ప్రణీత పేర్కొంది. కోలీవుడ్‌లో ఉదయన్, శకుని చిత్రాల్లో నటించిన కన్నడ భామ ప్రణీత. మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మంచి స్థానం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ప్రణీత కనిపించి చాలా కాలమైంది. ఇకపోతే కరోనా వైరస్‌ గురించి అందరూ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దాని నుంచి ఎలా కాపాడుకోవాలని ప్రభుత్వం, ప్రజలు పాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి ప్రణీత ఆలోచన మాత్రం వేరేగా ఉంది. అదేంటో మీరే చూడండి.

హిందువులు రెండు చేతులతో నమస్కరించడాన్ని ఇతరులు నవ్వుకున్నారు. బయట నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లేముందు చేతులు, కాళ్లు కడుక్కోవడం చూసి నవ్వుకున్నారు. జంతువులను పూజించడం చేసి నవ్వుకున్నారు. మొక్కలకు, వనాలకు ప్రణమిల్లడాన్ని నవ్వుకున్నారు. హిందువులు శాఖాహారాన్ని భుజించడం చూసి నవ్వుకున్నారు. యోగా చేయడం చూసి నవ్వుకున్నారు. మరణించిన వారి భౌతికకాయాలను దహనం చేయడాన్ని చూసి నవ్వుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన వారు  తరువాత తలారా స్నానం చేయడాన్ని నవ్వుకున్నారు.

అలాంటిది ఇప్పుడు ఎవరూ నవ్వడం లేదు. అందుకు బదులుగా ఆలోచిస్తున్నారు. ఈ అలవాట్లే కరోనాను వ్యాప్తి చెందకుండా చేస్తోంది. ఇది మతం కాదు. జీవన బాట. అని నటి ప్రణీత తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరిపై దండయాత్ర చేసిందో అర్థమైందా? హిందూయేతరుల గురించా, లేక పాశ్చాత్య దేశాల గురించా ఎవరికెలా అర్థమ అయితే అలా తీసుకోండి. అయితే అంతా లైట్‌గా తీసుకోండి. ప్రస్తుతం ప్రణీత చేతిలో తమిళంలో గానీ, తెలుగులో గానీ అవకాశాలు లేవు. ఇలాంటి ట్వీట్‌లతో వార్తల్లో ఉండే ప్రయత్నం అని అనుకున్నా, అభ్యంతరం లేదు.  

మరిన్ని వార్తలు