ఆయన రాజకీయాల్లోకి రావాలి!

9 Jul, 2017 01:29 IST|Sakshi
ఆయన రాజకీయాల్లోకి రావాలి!

తమిళసినిమా:  రజనీ సార్‌ రాజకీయాల్లోకి రావాలి. ఇలా అన్నది ఎవరో కాదు. విశ్వనటుడు కమలహాసన్‌ వారసురాలు, దక్షిణాదిలోనే కాకుండా భారతీయ చిత్రపరిశ్రమలోనే క్రేజీ నటిగా విరాజిల్లుతున్న నటి శ్రుతీహాసన్‌. ఈ బోల్డ్‌ తార ఏం చెప్పినా, ఏం చేసినా సంచలనమే. తనకు నచ్చింది చేసే, మనసుకు తట్టింది చెప్పే అరుదైన హీరోయిన్లలో శ్రుతీహాసన్‌ ఒకరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ మధ్యపెళ్లికి ముందే బిడ్డను కంటాను అని ఆ బ్యూటీ అన్నట్లు మీడియాలో వైరల్‌ అయిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన శ్రుతీహాసన్‌ పలు అంశాల గురించి ఒక భేటీలో తనదై బాణీలో టకటకా చెప్పాశారు.

వాటిలో కొన్నిటిని చూద్దాం. తాను ఎవరి సిఫారసుతోనూ నటిని కాలేదని, సొంత ప్రయత్నంతోనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. తన తండ్రి విజయాల్లో తాను ఒక్క శాతం కూడా సాధించలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. ఎవరినీ తప్పుపట్టి లాభం లేదని ఈ సమాజమే అలా ఉందని అన్నారు. మనదేశంలో మగవారికే గౌరవం ఎక్కువ అని పేర్కొన్నారు. చాలా మంది మగబిడ్డ పుడితే పండగ చేసుకుంటారని, ఆడపిల్ల పుడితే బాధ పడతారని అన్నారు.అయితే తమ ఇంట్లో అలా కాదన్నారు. తనకు మగపిల్లాడు పుడితే ఆడవారిని గౌరవించాలనే విషయాలను నేర్పిస్తానన్నారు. ఇకపోతే తమిళనాడును గానీ, తమిళులను గానీ తక్కువ చేసి మాట్లాడితే తాను అలాంటి వారి పని పడతానని శ్రుతీహాసన్‌ అన్నారు.

తన తండ్రి ఒక టీవీలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌ షో గురించి స్పందించాల్సిందిగా కోరగా ఆ షోను తాను ఇంకా చూడలేదని చెప్పారు. నటుడు రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం గురించి జరుగుతున్న చర్చ గురించి మాట్లాడుతూ రజనీ సార్‌ రాజకీయాల్లోకి రావాలని అన్నారు. అప్పుడే తమిళనాడులో మార్పు వస్తుందని, సినిమారంగానికి గౌరవం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక సంఘమిత్ర చిత్రం వివాదం గురించి అడిగిన ప్రశ్నకు అది ముగిసిపోయిన కథ అని టక్కున బదులిచ్చారు. ప్రస్తుతం ఆ బ్యూటీ తన తండ్రి దర్శకత్వంలో నటిస్తున్న శభాష్‌నాయుడు షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా మళ్లీ సంగీతంపై దృష్టిసారిస్తున్నారు. తన సంగీత బృందంతో కలిసి మ్యూజిక్‌ ఆల్భమ్‌ను తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.